పుష్ప, గల్లీ బాయ్తో స్టెప్పులేసిన గోల్డెన్ బాయ్.. వీడియో వైరల్
Neeraj Chopra: ఒలింపిక్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా పుష్ప (అల్లు అర్జున్), గల్లీ బాయ్ (రణ్వీర్ సింగ్) తో కలిసి స్టెప్పులేశాడు. ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్ లో చోప్రా తళుక్కున మెరిశాడు.
టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో లో స్వర్ణం సాధించిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బాలీవుడ్, టాలీవుడ్ నటులతో కాలు కదిపాడు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ‘ఇండియన్ ఆఫ్ ది ఈయర్’ ఈవెంట్ లో చోప్రా తళుక్కున మెరిశాడు. బుధవారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ తో పాటు బాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా గోల్డెన్ బాయ్ (నీరజ్ చోప్రా).. బన్నీ, రణ్వీర్ తో కలిసి హంగామా చేశాడు.
ఈ ఈవెంట్ ప్రారంభానికి ముందు బన్నీని కలిసిన నీరజ్ చోప్రా.. పుష్ప సినిమాలో ‘తగ్గేదేలే’ మ్యానరిజాన్ని అనుకరించాడు. ఇదే క్రమంలో బన్నీ.. నీరజ్ మాదిరి జావెలిన్ త్రో వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు.
బన్నీ నటించిన పుష్ప సినిమాకు గాను అతడికి ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ‘ఇండియన్ ఆఫ్ ది ఈయర్’ అవార్దు దక్కింది. క్రీడా విభాగంలో నీరజ్ చోప్రా ఈ అవార్డు తీసుకున్నాడు.
ఇక బన్నీతో మాట్లాడిన తర్వాత నీరజ్.. రణ్వీర్ సింగ్ తో స్టేజ్ మీద రచ్చ చేశాడు. ఈ కార్యక్రమంలో రణ్వీర్ నటించిన ‘83’ సినిమాకూ అవార్డు దక్కింది. 1983 వన్డే ప్రపంచకప్ లో భారత్ కు సారథ్యం వహించిన కపిల్ దేవ్ చేతుల మీదుగా రణ్వీర్ ఈ అవార్డు అందుకున్నాడు. అనంతరం అతడు నీరజ్ తో కలిసి సింబా సినిమాలోని ‘మేరే వాలా డాన్స్’ పాటకు డాన్స్ చేశాడు. స్టేజీ మీద రణ్వీన్ చేసి చూపించగా దానికి అతడు కూడా కాలు కదిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.