పాక్ బౌలర్కి ఎమ్మెస్ ధోనీ స్పెషల్ గిఫ్ట్... హారీస్ రౌఫ్ కోరిక తీర్చిన చెన్నై సూపర్ కింగ్స్...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత పాక్ ప్లేయర్లతో ముచ్చటించిన మహేంద్ర సింగ్ ధోనీ... అప్పుడు హరీస్ రౌఫ్ అడిగిన కోరికను తీర్చిన సీఎస్కే కెప్టెన్...
క్రికెటర్లకు ఫాలోవర్లు ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు. మహేంద్ర సింగ్ ధోనీకి మాత్రం భక్తులు ఉంటారు. ఇది చాలా సార్లు రుజువైంది కూడా. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, ‘మిస్టర్ కూల్’ ఎమ్మెస్ ధోనీ అభిమానుల లిస్టులో చేరిపోయాడు పాక్ పేసర్ హరీస్ రౌఫ్.
బిగ్ బాష్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన హరీస్ రౌఫ్, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో గ్రూప్ స్టేజ్లో ఐదుకి ఐదు మ్యాచుల్లో నెగ్గిన ఏకైక జట్టుగా నిలిచిన పాకిస్తాన్ జట్టు, ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో ఓడిన విషయం తెలిసిందే...
టీమిండియాతో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న పాకిస్తాన్ జట్టు, ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో భారత జట్టుపై తొలి గెలుపు నమోదు చేసింది. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన హరీస్ రౌఫ్ 25 పరుగులిచ్చి, హార్ధిక్ పాండ్యా వికెట్ తీశాడు...
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ ప్లేయర్లతో మాట్లాడి, వారికి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు టీమిండియా మెంటర్ మహేంద్ర సింగ్ ధోనీ. ఈ సమయంలో పాక్ పేసర్ హరీస్ రౌఫ్, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ కావాలని మాహీని కోరాడట...
‘ది లెజెండ్, కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఈ అందమైన తన షర్ట్ని నాకు కానుకగా పంపించాడు. ఈ ‘‘నెంబర్ 7’’ ఇప్పటికీ తన గుడ్వెల్తో, మంచి మనసుతో జనాల హృదయాలను గెలుచుకుంటూనే ఉన్నాడు... ఈ కానుకని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను..’ అంటూ సోషల్ మీడియా ద్వారా మాహీకి ధన్యవాదాలు తెలిపాడు హారీస్ రౌఫ్...
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజర్ రస్సెల్ రాధాకృష్ణన్, హారీస్ రౌఫ్ ట్వీట్పై స్పందించాడు. ‘మా కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ మాటిస్తే, దాన్ని కచ్చితంగా నిలబెట్టుకుంటాడు. నీకు ఇది నచ్చిందని అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు సీఎస్కే మేనేజర్...
28 ఏళ్ల హరీస్ రౌఫ్ ఇప్పటిదాకా పాకిస్తాన్ జట్టు తరుపున 8 వన్డేలు, 34 టీ20 మ్యాచులు ఆడాడు. వన్డేల్లో 14, టీ20ల్్లో 41 వికెట్లు తీసిన హరీస్ రౌఫ్, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టి, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా గెలిచాడు...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు ఐపీఎల్ 2021 సీజన్లో ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో సారి టైటిల్ గెలిచింది. ఫైనల్ మ్యాచ్లో కోల్కత్తా నైట్రైడర్స్ను ఓడించి, రెండేళ్ల తర్వాత టైటిల్ గెలిచింది సీఎస్కే.. 2021 సీజన్ తర్వాత ఎమ్మెస్ ధోనీ, ఐపీఎల్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకుంటాడని ప్రచారం జరిగింది. అయితే వచ్చే సీజన్ ఆడతానని కామెంట్ చేశాడు మాహీ...
ఐపీఎల్ 2022 రిటెన్షన్లో మాహీతో పాటు రవీంద్ర జడేజా, మొయిన్ ఆలీ, రుతురాజ్ గైక్వాడ్లను రిటైన్ చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్...