IPL Media Rights Tender: ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా భారీగా ఆర్జించాలని చూస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే బిడ్డింగ్ నుంచి అమెజాన్ వైదొలగగా తాజాగా మరో దిగ్గజ సంస్థ కూడా తప్పుకుంది.
బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్ కు మీడియా హక్కుల(2023-2027 కాలానికి) టెండర్ విషయంలో బీసీసీఐకి వరుసగా ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. ఆదివారం జరుగబోయే ఈ వేలానికి ముందు.. శుక్రవారం నిర్వహించిన టెక్నికల్ బిడ్డింగ్ లో అమెజాన్ పాల్గొనలేదు. అమెజాన్ తో పాటు గూగుల్ కూడా ఉన్నఫళంగా బిడ్డింగ్ నుంచి తప్పుకున్నాయి. ఈ షాక్ లో ఉన్న బీసీసీఐకి తాజాగా ZEE కూడా షాకిచ్చింది. అమెజాన్, గూగుల్ పోగా బిడ్డింగ్ ప్రక్రియలో నిలిచిన నాలుగు సంస్థలలో జీ కూడా ఒకటి. కానీ ఇప్పుడు అది కూడా బిడ్డింగ్ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
పలు జాతీయ వెబ్సైట్లలో వచ్చిన కథనాల మేరకు.. ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియ నుంచి జీ కూడా తప్పుకున్నదని సమాచారం. ప్యాకేజీ-ఏలో అది పోటీ పడటం లేదు. జీ కూడా తప్పుకోవడంతో ఇక మిగిలిన మూడు సంస్థలు.. వయాకామ్ 18 (రిలయన్స్), సోని, డిస్నీ స్టార్.
జీ ఎందుకు తప్పుకుంది..?
ప్యాకేజి-ఏ లో బిడ్డింగ్ ప్రక్రియ నుంచి జీ తప్పుకోవడానికి కారణాలున్నాయి.
జీ త్వరలోనే సోనితో కలవబోతున్నది. టెలివిజన్ రంగంలో చాలా కాలంగా దిగ్గజాలుగా ఉంటున్న ఈ రెండు సంస్థలు.. త్వరలోనే మెర్జ్ కాబోతున్నాయి. దీంతో తమతో తమకే పోటీ ఎందుకనే కారణంతో ప్యాకేజీ-ఏ నుంచి జీ తప్పుకున్నట్టు తెలుస్తున్నది.
ఈ ప్యాకేజీల కథేంది..?
ఐపీఎల్ నానాటికీ పెరుగుతున్న క్రేజ్, ఒక్క భారత్ లోనే గాక ఇతర దేశాల్లో కూడా దానికి వస్తున్న ఆదరణ చూసి బీసీసీఐ ఈ మీడియా హక్కులను నాలుగు ప్యాకేజీలుగా విభజించింది. నాలుగు ప్యాకేజీలలో ఎ,బి,సి లు పూర్తిగా ఉపఖండానికి సంబంధించినవి.
- ఎ : టీవీ హక్కులు
- బి : డిజిటల్ రైట్స్
- సి : ప్లే-ఆఫ్స్ సహా కొన్ని ప్రత్యేక మ్యాచులకు సంబంధించిన డిజిటల్ రైట్స్
- డి : ఉపఖండం మినహా ప్రపంచానికి సంబంధించిన ఉమ్మడి టీవీ, డిజిటల్ రైట్స్
ప్యాకేజీలకు పైసలు..?
ఈ ప్యాకేజీలలో ఒక్కో విభాగంలో ఒక్కో రేట్ ఉంది. ‘ఎ’ ప్యాకేజీలో ఒక్కో మ్యాచ్ కు రూ. 49 కోట్ల ప్రారంభ బిడ్డింగ్ కాగా.. ‘బి’ డిజిటల్ రైట్స్ కోసం మ్యాచ్ కు రూ. 33 కోట్లు గా నిర్ణయించారు. ‘సి’ లో ప్రాథమిక ధర రూ. 11 కోట్లు కాగా.. ‘డి’ లో రూ. 3 కోట్లకు తక్కువ కాకుండా బిడ్ వేయాల్సి ఉంటుంది. ఈ నాలుగింటిలో ఒక సంస్థ ఒకదానికే బిడ్ వేయాలన్న నిబంధనేమీ లేదు. నాలుగు ప్యాకేజీలకు ఒకే సంస్థ బిడ్ వేయొచ్చు. గతంలో ఒకే సంస్థకు ఏకమొత్తంగా హక్కులను కట్టబెట్టినట్టు కాకుండా.. ప్యాకేజీలో ఎవరు ఎక్కువ ధరకు పాడుకుంటే వాళ్ళకు హక్కులు దక్కుతాయి.
అయినా తగ్గేదేలే..
ఐపీఎల్ మీడియా హక్కుల విషయంలో అమెజాన్-రిలయన్స్ మధ్యే తీవ్ర పోటీ ఉందని నిన్నటి దాకా అనుకున్నారు. అయితే పలు కారణాల వల్ల అమెజాన్ ఈ డీల్ నుంచి తప్పుకున్నది. పై రెండు దిగ్గజాలు వేలంలో ఉంటే కనీసం రూ. 50 వేల కోట్ల నుంచి రూ. 60 వేల కోట్ల వరకు మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ ఆర్జించవచ్చునని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు అమెజాన్, గూగుల్ తో పాటు తాజాగా జీ కూడా తప్పుకోవడంతో బీసీసీఐ టార్గెట్ రీచ్ అవుతుందా..? అనేది అనుమానంగా ఉంది. అయితే ప్రస్తుతానికి మీడియా హక్కుల ప్రారంభ బిడ్ ధరే రూ. 32 వేల కోట్లుగా నిర్ణయించారు. ఓటీటీలు దుమ్మురేపుతున్న ఈ కాలంలో డిజిటల్ రైట్స్ కోసం ఉన్న మూడు సంస్థలైనా పోటా పోటీగా పోటీలో ఉంటాయని బీసీసీఐ భావిస్తున్నది. ఎంత లేదన్న రూ. 45 వేల కోట్ల కంటే తక్కువకు మీడియా రైట్స్ అమ్ముడుపోవని ఆశిస్తున్నది.
సాంకేతిక బిడ్డింగ్ క్లీయర్ చేసుకుని ఆదివారం వేలంలో ఉండే సంస్థలివే..
- డిస్నీ స్టార్
- రిలయన్స్ వయాకామ్ 18
- సోనీ నెట్వర్క్
- జీ ఎంటర్టైన్మెంట్
- టైమ్స్ ఇంటర్నెట్ (డిజిటల్ రైట్స్ కు మాత్రమే)
- రిలయన్స్ జియో (డిజిటల్ రైట్స్)
- సూపర్ స్పోర్ట్ (ఉపఖండం ఆవల - ప్యాకేజీ డీ)
