Asia Cup 2022: భారత్-పాకిస్తాన్ మధ్య  ఏడాదికోసారి మ్యాచ్ జరిగినా  అందులో  టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్  కనిపించడం లేదు. అయితే ఇందుకు గల కారణాలేంటో  పాకిస్తాన్ మాజీ సారథి  మహ్మద్ హఫీజ్ తెలిపాడు. 

భారత్-పాక్ మ్యాచ్ అంటేనే హైఓల్టేజ్ గేమ్. దాయాదుల మధ్య జరిగే మ్యాచ్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. అయితే గత 8 ఏండ్లుగా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న మ్యాచ్ లలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేకుండానే భారత్ బరిలోకి దిగుతున్నది. అయితే భారత్ ఎందుకిలా చేస్తుంది..? టెస్టు, వన్డేలలో రెగ్యులర్ ఆటగాడైన అశ్విన్ ను పాకిస్తాన్ వంటి హై ప్రెషర్ మ్యాచ్ లో భారత్ ఎందుకు ఆడించడం లేదు..? అనే ప్రశ్న సామాన్య క్రికెట్ అభిమానికి తలెత్తేదే. ఈ ప్రశ్నకు ఇప్పుడు పాకిస్తాన్ మాజీ సారథి మహ్మద్ హఫీజ్ సమాధానం చెప్పాడు. 2014లో ఆసియా కప్ లో భారత్ - పాక్ మ్యాచ్ సందర్బంగా అశ్విన్ వేసిన చివరి ఓవర్లో షాహిద్ అఫ్రిది వరుసగా రెండు సిక్సర్లు బాది మ్యాచ్ ను గెలిపించడమే ఇందుకు కారణమని అన్నాడు. 

ఓ టీవీ చర్చలో భాగంగా ఇదే విషయమై హఫీజ్ మాట్లాడుతూ.. ‘ఈ విషయం గురించి స్పందించేముందు నేను ముందు షాహిద్ బాయ్ (షాహిద్ అఫ్రిది) కు కృతజ్ఞతలు చెప్దామనుకున్నా. 2014 ఆసియా కప్ లో భాగంగా జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో చివరి ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్ లో అఫ్రిది రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్ గెలిపించాడు. ఆ ప్రభావంతో దాయాదుల పోరులో అశ్విన్ ఆడించేందుకు భారత్ భయపడుతోంది..’ అని అన్నాడు. 

2014 ఆసియా కప్ మ్యాచ్ విషయానికొస్తే.. వన్డే ఫార్మాట్ లో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. భారత జట్టు తరఫున రోహిత్ శర్మ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా రాణించారు. ఇక 246 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ కు అహ్మద్ షెహజాద్, మహ్మద్ హఫీజ్ లు మంచి స్కోర్లు చేసి పాక్ ను పటిష్ట స్థితిలో నిలిపారు. కానీ క్రమంగా వికెట్లు కోల్పోయి పాకిస్తాన్ కష్టాల్లో పడింది. చివరి ఓవర్లో పది పరుగులు చేయాల్సి ఉండగా ఆ ఓవర్ ను అశ్విన్ తో వేయించాడు అప్పటి భారత సారథి విరాట్ కోహ్లీ. 

ఆ ఓవర్లో తొలి బంతికి అశ్విన్.. అజ్మల్ ను ఔట్ చేశాడు. తర్వాత బంతికి జునైద్ సింగిల్ తీశాడు. అప్పుడు స్ట్రైకింగ్ కు వచ్చిన అఫ్రిది.. వరుసగా రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదాడు. దీంతో విజయం పాక్ వశమైంది.

Scroll to load tweet…

అయితే హఫీజ్ చేసిన ఈ వ్యాఖ్యలు అసంబద్ధమైనవి అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్. 2018 తర్వాత అశ్విన్ టీ20లలో ఆడింది చాలా తక్కువ. నాలుగేండ్ల తర్వాత అతడు 2021 టీ20 ప్రపంచకప్ లో రీఎంట్రీ ఇచ్చినా అశ్విన్ బెంచ్ కే పరిమితమయ్యాడే తప్ప తుది జట్టులో ఉన్నది చాలా తక్కువ. టెస్టులలో రెగ్యులర్ బౌలర్ గా ఉన్న అశ్విన్.. వన్డేలు, టీ20లలో మాత్రం అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. స్పిన్నర్లు జడేజా, చాహల్, కుల్దీప్ లతో పాటు తాజాగా అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ లు కూడా జట్టులోకి రావడంతో అశ్విన్ కు చోటు దక్కడమే గగనంగా మారింది. అంతేగానీ ప్రత్యేకించి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో పాక్ ఆటగాళ్లకు భయపడి కాదని కౌంటర్ ఇస్తున్నారు. అదీగాక గతేడాది టీ20 ప్రపంచకప్, ఆసియా కప్ లో సూపర్-4లో ఒక మ్యాచ్ లో విజయాలు మినహాయిస్తే మెగా టోర్నీలలో భారత్ పై పాక్ కు దారుణమైన రికార్డు ఉంది. అశ్విన్ ఉన్నంత మాత్రానా ఈ మ్యాచ్ లలో పాకిస్తాన్ గెలిచేదా..? అని ప్రశ్నిస్తున్నారు.