నాన్న చనిపోయిన తర్వాత అమ్మ ఫోన్ చేసి ఇలా చెప్పింది... అందుకే ఈ నిర్ణయం... మహమ్మద్ సిరాజ్!
ఆసీస్ టూర్ ప్రారంభానికి ముందే మహమ్మద్ సిరాజ్ తండ్రి కన్నుమూత...
స్వదేశానికి పంపడానికి బీసీసీఐ ఆఫర్ ఇచ్చినా జట్టుతో ఉండడానికి ప్రాధాన్యం ఇచ్చిన సిరాజ్...
తాజా ఇంటర్య్వూలో ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని తెలిపిన మహమ్మద్ సిరాజ్..
INDvsAUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్కు సెలక్ట్ అయ్యాడు హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన సిరాజ్, అంతకుముందు జరిగిన దేశవాళీ క్రికెట్ టోర్నీల్లోనూ ఆకట్టుకున్నాడు. అయితే ఆసీస్ టూర్ ప్రారంభానికి ముందే మహమ్మద్ సిరాజ్ తండ్రి చనిపోయాడు.
ఆస్ట్రేలియాలో క్వారంటైన్లో ఉన్న సిరాజ్, తండ్రి చివరిచూపుకి కూడా నోచుకోలేకపోయాడు.ఊహించని ఈ విషాద సంఘటన తర్వాత మహమ్మద్ సిరాజ్ను స్వదేశం పంపాలని భావించింది బీసీసీఐ. అయితే ఆ ఆఫర్ను తిరస్కరించిన సిరాజ్, భారత జట్టుతో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాడు. తన అంకితభావంతో యావత్ భారత్ గుండెలను దోచుకున్న సిరాజ్, అంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు.
‘తండ్రి చనిపోయిన తర్వాత అమ్మ ఫోన్ చేసింది. నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అక్కడే ఉండు, క్రికెట్ ఆడు, దేశానికి క్రికెట్ ఆడడం కంటే ఇదేమీ ముఖ్యం కాదు. నాన్న కోరుకున్నది కూడా అదే... ’ అంటూ తన నిర్ణయం వెనక తల్లి ప్రోత్సాహం ఉందని చెప్పాడు మహమ్మద్ సిరాజ్. సిరాజ్ ఇంటర్వ్యూని సోషల్ మీడియాలో పోస్టు చేసింది బీసీసీఐ.