Mohammad Azharuddin:  హైదరాబాద్ కు చెందిన నోయెల్ డేవిడ్ గతంలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.  కొంతకాలంగా అతడు కిడ్నీ సంబంధిత వ్యాధితో... 

గతంలో భారత జట్టుకు ఆడిన మాజీ క్రికెటర్ నోయెల్ డేవిడ్ ఆరోగ్యానికయ్యే ఖర్చునంతా తాము భరిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్ధీన్ తెలిపాడు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డేవిడ్ ను అజారుద్ధీన్ సోమవారం కలిశాడు. ఈ సందర్భంగా డేవిడ్ చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి వైద్యులతో.. అతడి ఆరోగ్యం గురించి అజారుద్ధీన్ ఆరా తీశాడు.

నోయెల్ డేవిడ్ గతంలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. హైదరాబాద్ కు చెందిన డేవిడ్.. 1997లో వెస్టిండీస్ లో పర్యటించిన భారత జట్టులో సభ్యుడు. ఆ పర్యటనకు ముందు టీమిండియా స్టార్ పేసర్ జవగళ్ శ్రీనాథ్ గాయపడటంతో డేవిడ్ కు అవకాశం దక్కింది. ఆ సిరీస్ తో పాటు లంకతో వన్డే సిరీస్ లో కూడా ఆడాడు. 

Scroll to load tweet…

ఆఫ్ స్పిన్ తో పాటు బ్యాటింగ్ చేయగల డేవిడ్ కు బ్యాట్ తో పెద్దగా అవకాశాలు రాకపోయినా బౌలింగ్ లో మాత్రం ఫర్వాలేదనిపించాడు. నాలుగు వన్డేలలో అతడికి అవకాశం రాగా.. నాలుగు వికెట్లు పడగొట్టాడు. 1997లో లంకతో వన్డే మ్యాచ్ తర్వాత డేవిడ్ కు ఇక జాతీయ జట్టకు ఆడే అవకాశం రాలేదు.

51 ఏండ్ల డేవిడ్.. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవలే అతడికి హైద్రాబాద్ లోని జూబ్లిహిల్స్ లో ఉన్న అపోలో ఆస్పత్రిలో.. ఈ నెలలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఖర్చునంతా హెచ్సీఏ నే భరించనుంది. ఈ మేరకు అజారుద్దీన్.. డేవిడ్ ను కలిసిన తర్వాత హెచ్సీఏ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. 

హెచ్సీఏ స్పందిస్తూ.. ‘ఈరోజు హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్ధీన్ అపోలోలో చికిత్స పొందుతున్న నోయెల్ డేవిడ్ ను కలిశారు. ఆస్పత్రి వైద్యులతో డేవిడ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అతడి ఆరోగ్యానికయ్యే ఖర్చును మొత్తం భరించడానికి హెచ్సీఏ ముందుకొచ్చింది. దీంతో పాటు అతడి వ్యక్తిగత ఖర్చును కూడా మేము భరిస్తాం..’ అని తెలిపింది.