వరుసగా రెండు ఓటముల తర్వాత కసితో ఉన్న ముంబై ఇండియన్స్‌ కేకేఆర్‌తో జరుగుతోన్న మ్యాచ్‌పై పట్టు సాధించింది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌ జట్టు కేకేఆర్‌ను కట్టడి చేసింది. 16.2 ఓవర్లలో 116కే కేకేఆర్‌ను పరిమితం చేసింది..  

అయితే ఈ మ్యాచ్‌లో ఓ యంగ్‌ ప్లేయర్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. 23 ఏళ్ల అశ్వని కుమార్‌ తొలి మ్యాచ్‌లో అదరగొట్టాడు. మొదటి బంతికే వికెట్ తీసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఇక అక్కడితో ఆగకుండా ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. మొత్తం మూడు ఓవర్లు వేసిన అశ్వని 24 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లను పడగొట్టాడు. 

దీంతో ఇప్పుడు అంత ఎవరీ అశ్వని కుమార్‌ అని అంతా తెగ వెతికేస్తున్నారు. తొలి మ్యాచ్‌లోనే 4 వికెట్లు పడగొట్టి తన డెబ్యూ మ్యాచ్‌ని ఎంతో మరపురానిదిగా మార్చుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో డెబ్యూ మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అశ్వనీ కుమార్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అశ్వని కుమార్‌ బౌలింగ్ విషయానికొస్తే ఎడమచేతి వాటం పేసర్. 

2025 మెగా వేలంలో ఫ్రాంచైజీ అశ్విని కుమార్‌ను రూ. 30 లక్షలకు దక్కించుకుంది. అతను గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టులో కూడా ఉన్నాడు. కానీ, ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోలేదు. 2022లో సయ్యద్‌ ముఫ్తాక్‌ అలీ ట్రోఫీలో పంజాబ్‌ తరఫున కెరీర్‌ను మొదలు పెట్టాడు. కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అశ్వనీ కుమార్‌ 8.50 ఎకానమీతో తన ఖాతాలో 3 వికెట్లు వేసుకున్నాడు. కాగా అశ్వని పంజాబ్ తరపున 2 ఫస్ట్-క్లాస్, 4 లిస్ట్-ఎ మ్యాచ్‌లు కూడా ఆడాడు. 

Scroll to load tweet…

కేకేఆర్ బ్యాటింగ్ విషయానికొస్తే.. ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 16.2 ఓవర్లలో 116 పరుగులకు కుప్పకూలింది. అంగ్‌క్రిష్ రఘువంశీ(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26), రమణ్‌దీప్ సింగ్(12 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు.