MI vs DC: ఢిల్లీ క్యాపిట‌ల్స్ ను ఓడించి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియ‌న్స్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ లో త‌న బెర్త్ ను క‌న్ఫార్మ్ చేసుకుంది. 

IPL 2025 MI vs DC: ఐపీఎల్ 2025 63వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ త‌ల‌ప‌డ్డాయి. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో మంచి ప్ర‌ద‌ర్శ‌న‌తో ఢిల్లీ పై ముంబై విజ‌యం సాధించింది. ఈ గెలుపుతో ముంబై జ‌ట్టు ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్ లో నాల్గ‌వ టీమ్ గా చోటుద‌క్కించుకుంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అవుట్ అయింది.

ఈ మ్యాచ్ లో తాత్కాలిక కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. చివరి రెండు ఓవర్లలో 48 పరుగులతో ముంబై ఢిల్లీ ముందు 181 పరుగుల టార్గెట్ ను ఉంచింది.

ముంబై తరఫున సూర్య కుమార్ యాదవ్, నమన్ ధీర్ చివరి రెండు ఓవర్లలో భారీ స్కోరు చేశారు. సూర్యకుమార్ 43 బంతుల్లో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నమన్ ధీర్ 8 బంతుల్లో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సూర్యకుమార్ 7 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. నమన్ బ్యాట్ నుండి 2 ఫోర్లు, 2 సిక్సర్లు వచ్చాయి.

వారిద్దరూ 21 బంతుల్లో 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తిలక్ వర్మ బ్యాట్ నుండి 27 పరుగులు వచ్చాయి. ముంబై తరఫున ర్యాన్ రికెల్టన్ 25, విల్ జాక్స్ 21 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 5 పరుగులు చేసి అవుట్ కాగా, హార్దిక్ పాండ్యా 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఢిల్లీ తరఫున ముఖేష్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. దుష్మంత చమీర, ముస్తాఫిజుర్ రెహమాన్, కుల్దీప్ యాదవ్ ఒక్కొక్కరు ఒక వికెట్ తీసుకున్నారు. 

ముంబై సూపర్ బౌలింగ్ 

181 పరుగుల టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 121 పరుగులకే ఆలౌట్ అయింది. 59 పరుగుల తేడాతో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ రేసు ముగిసింది. ఢిల్లీ బ్యాటర్లలో సమీర్  రిజ్వీ 39 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా ఢిల్లీ ప్లేయర్లు రాణించలేకపోయారు. ముంబై బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 3, బుమ్రా 3 వికెట్లు తీసుకుని ఢిల్లీ క్యాపిటల్స్ ను దెబ్బకొట్టారు. 

ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయింది. ఢిల్లీ బ్యాటర్లలో సమీర్ రిజ్వీ 39 పరుగులు, విప్రజ్ నిగమ్ 20 పరుగులు, అశుతోష్ శర్మ 18 పరుగులు, కేఎల్ రాహుల్ 11 పరుగులు చేశారు. ఈ నలుగురు తప్ప, మరే ఇతర బ్యాట్స్‌మన్ కూడా రెండంకెల స్కోరును దాటలేకపోయారు.