ఓడమ్మా జీవితం.. ఒక్క టీషర్ట్కు ఐదు వేలా..? ఇదే కోఠిలో అయితే 200కే కదరా! టీమిండియా జెర్సీలపై ఫ్యాన్స్ ట్రోల్స్
Team India Jersey: భారత క్రికెట్ జట్టు త్వరలో జరుగబోయే ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్స్ నుంచి కొత్త జెర్సీలలో కనిపించనుంది. బీసీసీఐతో అడిడాస్ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు భారత క్రికెటర్లు కొత్త జెర్సీలలో మెరవనున్నారు.
భారత క్రికెట్ జట్టు ఇటీవలే కొత్త జెర్సీని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ ‘అడిడాస్’ బీసీసీఐతో చేసుకున్న ఐదేండ్ల ఒప్పందం మేరకు టీమిండియా కిట్ స్పాన్సర్గా వ్యవహరించనుంది. టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్, విరాట్, హార్ధిక్, శుభ్మన్ తో పాటు మహిళా క్రికెటర్లు హర్మన్ప్రీత్, స్మృతి మంధానలు ఇటీవలే కొత్త జెర్సీలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతా బాగానే ఉన్నా ధరల విషయంలో మాత్రం క్రికెట్ ఫ్యాన్స్.. అడిడాస్ ను ఆటాడుకుంటున్నారు.
మూడు ఫార్మాట్లకూ మూడు రకాల జెర్సీలను తయారుచేసిన అడిడాస్.. వన్డే, టీ20, టెస్టు జెర్సీలకు ఒక్కోదానికి రూ. 4,999 గా ధర నిర్ణయించింది. ఇక వాటి మాదిరిగానే (నాణ్యత కాస్త తక్కువగా) ఉండే జెర్సీలకు ధర రూ. 2,999గా సెట్ చేసింది. వన్డే ఫ్యాన్స్ జెర్సీలను రూ. 999కు అందజేస్తున్నది. అడిడాస్ అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి వీటిని కొనుగోలు చేయవచ్చు.
అయితే ఈ జెర్సీల రేట్లు చూశాక ఫ్యాన్స్ అడిడాస్ ను ఆటాడుకుంటున్నారు. క్రికెట్ కు బీభత్సమైన క్రేజ్ ఉండే ఇండియాలో తమ అభిమాన ఆటగాడి పేరు ఉన్న లేదా టీమిండియా జెర్సీ గానీ వేసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. కానీ ఈ ధరలు మాత్రం మండిపోతుండటంతో ఫ్యాన్స్ కాస్త నిరాశచెందారు. వారం రోజులు ఆగితే ‘అబిబాస్’ జెర్సీలు మార్కెట్లోకి వస్తాయని అవి రూ. 200 నుంచి రూ. 300 కే లభ్యమవుతాయని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదే విషయమై కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఒక్క జెర్సీకి రూ. 5 వేలా..? ఇదే ముంబై లోకల్ మార్కెట్లో గానీ వాంఖెడే స్టేడియానికి పక్కనఉండే గల్లీలోకి వెళ్తే ఈ ధరకు 50 జెర్సీలను కొనొచ్చు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్.. ‘రూ. 300 కే దొరికే అబిబాస్ జెర్సీ కోసం వెయిటింగ్ ఇక్కడ..’ అని కామెంట్స్ చేశారు. కొంతమంది తెలుగు అభిమానులు కూడా ఈ ట్వీట్ కు స్పందిస్తూ.. ‘వారం రోజులు ఆగితే ఇవే జెర్సీలు మా కోఠిలో రూ. 200 కే కొనుక్కోవచ్చు. ఎక్కడా ఒరిజినల్, డూప్లికేట్ జెర్సీకి తేడానే కనిపించదు. అంత పర్ఫెక్షనిస్టులు ఉన్నారు’అని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. మూడు రోజుల క్రితమే ముంబైలోని ప్రఖ్యాత వాంఖెడే స్టేడియంలో అడిడాస్.. ప్రత్యేకమైన డ్రోన్ల సాయంతో ఈ జెర్సీలను ప్రదర్శించిన విషయం తెలిసిందే. టీమిండియా పురుషుల, మహిళల, జూనియర్, భారత్ - ఎ, భారత్ - బి, అండర్ - 19 ఆటగాళ్లందరూ ఇదే జెర్సీని ధరిస్తారు. 2028 వరకూ అడిడాస్ బీసీసీఐ కిట్ స్పాన్సర్ గా ఉండనుంది.