వార్మప్ గేమ్‌లో మూడు సార్లు బ్యాటింగ్‌కి వచ్చిన హనుమ విహారి, శుబ్‌మన్ గిల్... రెండు వైపులా బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రిత్ బుమ్రా... తొలి ఇన్నింగ్స్‌లో అటు వైపు, రెండో ఇన్నింగ్స్‌లో ఇటు వైపు బ్యాటింగ్ చేసిన ఛతేశ్వర్ పూజారా.. 

వార్మప్ మ్యాచ్... నిజంగానే పూర్తి ప్రాక్టీస్ మ్యాచ్‌గా నడిచింది. నాలుగు రోజుల పాటు సాగిన మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లు అందరికీ ప్రాక్తీస్ దొరకడం విశేషం. ఛతేశ్వర్ పూజారా... అటు ఇండియా తరుపున, ఇటు లీస్టర్‌షైర్ తరుపున బ్యాటింగ్ చేయగా... భారత బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రిత్ బుమ్రా ఇరు జట్ల తరుపున బౌలింగ్ చేశారు... శుబ్‌మన్ గిల్, హనుమ విహారి అయితే ఒకే ఇన్నింగ్స్‌లో రెండు టీమ్‌ల తరుపున బ్యాటింగ్‌కి వచ్చారు. మొత్తానికి ప్లేయర్లందరికీ కావాల్సినంత ప్రాక్టీస్ ఇచ్చిన వార్మప్ డ్రాగా ముగిసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి రోజు 60.2 ఓవర్లు బౌలింగ్ చేసి 8 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 25, శుబ్‌మన్ గిల్ 21, హనుమ విహారి 3, విరాట్ కోహ్లీ 33 పరుగులు చేయగా శ్రేయాస్ అయ్యర్ డకౌట్ అయ్యాడు. శ్రీకర్ భరత్ 111 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో లీస్టర్‌షైర్ తరుపున ఆడిన ప్రసిద్ధ్ కృష్ణ ఓ వికెట్ తీయగా, జస్ప్రిత్ బుమ్రాకి వికెట్లేమీ దక్కలేదు...

భారత బ్యాటర్లు రిషబ్ పంత్, ఛతేశ్వర్ పూజారా లీస్టర్‌షైర్ తరుపున బ్యాటింగ్‌కి వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో 244 పరుగులకి ఆలౌట్ అయ్యింది లీస్టర్‌షైర్. పూజారా, షమీ బౌలింగ్‌లో డకౌట్ కాగా, రిషబ్ పంత్ 87 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 76 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

తొలి రెండు ఇన్నింగ్స్‌లో జట్టులో లేని రవిచంద్రన్ అశ్విన్, మూడో రోజు టీమ్‌తో కలిశాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 92 ఓవర్లు బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. శ్రీకర్ భరత్ 43, శుబ్‌మన్ గిల్ 38 పరుగులు చేయగా హనుమ విహారి 20 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 62, శార్దూల్ ఠాకూర్ 28 పరుగులు చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేసి అవుట్ కాగా ఛతేశ్వర్ పూజారా 22 పరుగులు, రవీంద్ర జడేజా 56 పరుగులు చేశారు...

రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణతో పాటు నవ్‌దీప్ సైనీ, కమ్లేశ్ నాగర్‌కోటీ, సాయి కిషోర్ కూడా లీస్టర్‌షైర్ తరుపున బౌలింగ్ చేయడం విశేషం. సైనీకి 3 వికెట్లు, కమ్లేశ్ నాగర్‌కోటికి రెండు వికెట్లు దక్కాయి. తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లో టీమిండియా తరుపున బ్యాటింగ్ చేసిన శుబ్‌మన్ గిల్, ఆఖరి రోజు లీస్టర్‌షైర్ తరుపున బ్యాటింగ్ చేశాడు...

హసన్ ఆజాద్ 12 పరుగులు చేసి అవుట్ కాగా శుబ్‌మన్ గిల్ 77 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. శామ్యూల్ ఇవన్స్ 26, హనుమ విహారి 26 పరుగులు చేయగా లూయిస్ కింబర్ 58, జో ఎవిసన్ 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆఖరి రోజు 66 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన లీస్టర్‌షైర్ 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది...

లీస్టర్‌షైర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారత జట్టు తరుపున ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రిత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, ప్రసిద్ధ్ కృష్ణ, శ్రేయాస్ అయ్యర్ రూపంలో 9 మంది బౌలింగ్ చేయడం విశేషం. మొత్తంగా ఈ వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టులోని ప్రతీ ప్లేయర్‌ (నెట్ బౌలర్లతో సహా) ఆడడం విశేషం..