Pakistan Vs Australia: పాక్-ఆసీస్ ల మధ్య రావల్పిండిలో తొలి టెస్టు.. పేలవమైన డ్రా గా ముగిసింది. ఇవే జట్లు కరాచీలో కూడా పోటీ పడ్డాయి. ఫలితం అదే. ఈ నేపథ్యంలో నిర్జీవ పిచ్ లను తయారుచేస్తున్న పీసీబీపై..
పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు మ్యాచుల టెస్టు సిరీస్ లో ఇప్పటికే రెండు టెస్టులు ముగిసినా ఒక్కదాంట్లో కూడా ఫలితం తేలలేదు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తయారుచేస్తున్న పిచ్ లు ఏమాత్రం బౌలర్లకు సహకరించడం లేదు. స్వదేశంలో సిరీస్ లు ఆడుతున్నా పిచ్ లు మాత్రం స్పిన్నర్లకు, సీమర్లకు ఏమాత్రం సహకారం అందించడం లేదు. ఇరుజట్ల బ్యాటర్లు పండుగ చేసుకుంటున్న సిరీస్ లో ఫలితం తేలని నిర్జీవ పిచ్ లను తయారుచేస్తున్న పీసీబీపై పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయమై తాజాగా ఆ జట్టు మాజీ ఆటగాడు ఆకిబ్ జావేద్ మాట్లాడుతూ.. పీసీబీ నాణ్యమైన పిచ్ లు తయారుచేయలేదా..? అందుకోసం ఎక్కడికో వెళ్లడమెందుకు.. భారత క్యూరేటర్ల నుంచి నేర్చుకుంటే సరిపోదా..? అని అసహనం వెలిబుచ్చాడు.
‘పీసీబీ నాణ్యమైన పిచ్ ల కోసం ప్రపంచమంతటా వెతుకుతుంది. ఎక్కడికో వెళ్లడమెందుకు..? మన పక్కనే ఉన్న ఇండియాలో క్యూరేటర్లను చూడండి.. ముంబై, బెంగళూరు, చెన్నై లలో క్యూరేటర్లు ఎంత బాగా పిచ్ లు తయారుచేస్తున్నారో గమనించండి. స్వదేశంలో స్పిన్నర్లకు సహకరించేందుకు, ప్రత్యర్థి జట్టు మీద ఆధిపత్యం వహించేందుకు మంచి టర్నింగ్ పిచ్ లను తయారుచేస్తున్నారు. కానీ పాక్ మాత్రం అలాంటి పిచ్ లను ఎందుకు తయారు చేయడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. భారత్ లో క్యూరేటర్లు టర్నింగ్ పిచ్ లను తయారుచేసినట్టు మనకు కూడా చేస్తే స్పిన్నర్లకు ఉపయోగకరంగా ఉంటుంది కదా...’ అని వ్యాఖ్యానించాడు.
పిచ్ లపై పాక్ మాజీలు పీసీబీపై దుమ్మెత్తి పోయడం ఇదేం కొత్త కాదు. రావల్పిండి లో తొలి టెస్టు విఫలమయ్యాక ఆ జట్టు మాజీ సారథులు ఇంజమామ్ ఉల్ హక్, సల్మాన్ భట్ లు కూడా పీసీబీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్జీవ పిచ్ లు కాకుండా కొంచెం ఫలితం వచ్చే పిచ్ లు తయారుచేయాలని పీసీబీకి సూచించారు. ఇక కరాచీలో తొలి రెండు రోజుల ఆట ముగిశాక కూడా పిచ్ లో పెద్దగా మార్పులు లేకపోవడంపై మాజీ సారథి వసీం అక్రమ్ కూడా పీసీబీపై ఫైర్ అయ్యాడు. రావల్పిండి పిచ్ ను పరిశీలించిన ఐసీసీ కూడా.. దానికి బిలో యావరేజీ రేటింగ్ కూడా దండగ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
మీరు చూడండి : ఐసీసీని కోరిన పీసీబీ
పిచ్ లపై వరుస విమర్శలు వస్తున్న నేపథ్యంలో పీసీబీ అప్రమత్తమైంది. పాక్-ఆసీస్ ల మధ్య మూడో టెస్టు జరుగబోయే లాహోర్ (గడాఫీ స్టేడియం) పిచ్ ను మ్యాచుకు ముందు పరిశీలించాలని పీసీబీ.. ఐసీసీ అకాడమీ హెడ్ క్యూరేటర్ టాబి లమ్స్డెన్ ను అభ్యర్థించింది. కాగా, ఇదే విషయమై పీసీబీకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. పీసీబీ చైర్మెన్ రమీజ్ రాజా పాక్ లో నాణ్యమైన పిచ్ లను తయారుచేయాలని భావిస్తున్నారని, అందులో రాజీ పడేదే లేదని తెలిపాడు.
