కోహ్లీ కెప్టెన్సీ అదుర్స్.... ధోనీ, గంగూలీల రికార్డులు బద్దలు
ఆంటిగ్వా టెస్ట్ విజయం ద్వారా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్లో టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన ఏకైక క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.
వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఇప్పటికే టీ20, వన్డే సీరిస్ లను క్లీన్ స్వీప్ చేసిన టెస్ట్ సీరిస్ లోనూ అదే ఫలితాన్ని రాబట్టే ప్రయత్నంలో మొదటి అడుగును సక్సెస్ఫుల్ గా ముగించింది. ఆంటిగ్వా వేదికన జరిగిన తొలి టెస్ట్ లో వెస్టిండిస్ ను మరోసారి చిత్తుచేసి 318 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం ద్వారా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలోకి కూడా ఓ అరుదైన రికార్డు చేరింది.
టెస్ట్ క్రికెట్లో టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా కోహ్లీ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట వుండేది. కానీ అతడి కంటే వేగంగా అతి తక్కువ మ్యాచుల్లో 27 సెంచరీలను అందించిన కెప్టెన్ గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
రెండు టెస్టుల సీరిస్ ను టీమిండియా క్వీన్ స్వీప్ చేస్తే కోహ్లీ ఖాతాలోకి 28వ టెస్ట్ విజయం చేరుతుంది. దీంతో ధోని కెప్టెన్సీలో సాధించిన 27 విజయాల రికార్డు కూడా బద్దలవనుంది. ధోని 60 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించి 27 విజయాలు అందివ్వగా కోహ్లీ కేవలం 47 టెస్టుల్లోనే 27 విజయాలను అందివ్వడం విశేషం.
అంతేకాకుండా మరో దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును కోహ్లీ బద్దలుగొట్టాడు. గతంలోనే అత్యధిక టెస్ట్ విజయాలు అందించిన కెప్టెన్ల లిస్ట్ లో రెండో స్థానంలో నిలిచిన(21 విజయాలతో) గంగూలీని కోహ్లీ వెనక్కినెట్టాడు. తాజాగా విదేశాల్లో భారత జట్టుకు అత్యధిక విజయాలు అందించిన గంగూలీ కెప్టెన్సీ రికార్డును సైతం కోహ్లీ అధిగమించాడు. గంగూలీ విదేశీగడ్డపై టీమిండియాకు 11 విజయాలు అందిస్తే కోహ్లీ 12విజయాలతో టాప్ లో నిలిచాడు.
ఆంటిగ్వా వేదికన జరిగిన మొదటి టెస్ట్ లో విజయం సాధించిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ ఆటగాళ్లంతా సమిష్టిగా ఆడటం వల్లే ఈ విజయాన్ని సాధించామన్నాడు. కేవలం కెప్టెన్ నేను నిర్ణయాలు మాత్రమే తీసుకున్నాను. కానీ ఆటగాళ్లు వాటిని సమర్థవంతంగా అమలు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. టెస్ట్ ఛాంపియన్షిప్ ను ఇలా విజయంతో ఆరంభించడం మంచి పరిణామమని కోహ్లీ పేర్కొన్నాడు.