ఐపీఎల్ 2021 సీజన్‌కి దూరంగా ఉండాలని ఫిలిప్ నిర్ణయం...జోష్ ఫిలిప్ స్థానంలో న్యూజిలాండ్ యంగ్ వికెట్‌ కీపర్‌ను తీసుకున్న ఆర్‌సీబీ...ఫిలిప్ స్థానంలో ఆడనున్న ఫిన్ ఆలెన్... 2021 సీజన్‌లో ఆర్‌సీబీపై భారీ అంచనాలు...

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఊహించని షాక్ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా యంగ్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌ సీజన్ మొత్తానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

గత ఏడాది ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన ఫిలిప్, ఐదు మ్యాచులు ఆడి 78 పరుగులు చేశాడు. అయితే ఈ ఏడాది బిగ్‌బాష్‌ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లలో ఒకడిగా ఉన్నాడు జోష్ ఫిలిప్.ఫిలిప్‌కి రిప్లేస్‌మెంట్‌గా న్యూజిలాండ్ యంగ్ హిట్టర్, వికెట్ కీపర్ ఫిన్ ఆలెన్‌ను జట్టులోకి తీసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

జోష్ ఫిలిప్‌కి చెల్లించే బేస్ ప్రైజ్ రూ.20 లక్షలే ఆలెన్‌కి కూడా ఇవ్వనున్నారు. ఈ ఏడాది మినీ వేలంలో ఆర్‌సీబీ కేల్ జెమ్మీసన్‌ను రూ.15 కోట్లు, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రూ.14.25 కోట్లు, డానియల్ క్రిస్టియన్‌ను రూ.4.8కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

వీళ్లు కాకుండా దేశవాళీ యంగ్ క్రికెటర్లు సచిన్ బేబీ, రాజర్ పటిదార్, అజారుద్దీన్, సూర్యష్ ప్రభుదేశాయ్, కెఎస్ భరత్‌లను బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ.