ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు.. వార్నర్ కు అప్పుడు అండగా నిలిచింది వాళ్లే కదా.. మరిచిపోయారా? : ఇర్ఫాన్ పఠాన్
David Warner: ఆస్ట్రేలియా ఆటగాడు, నిన్నటి దాకా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిథ్యం వహించిన డేవిడ్ వార్నర్ ను ఆ జట్టు రిటైన్ చేసుకోవడంపై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు విమర్శలు సందిస్తున్న నేపథ్యంలతో ఇర్ఫాన్ పఠాన్ వాళ్లను ఘాటుగా రిప్లై ఇచ్చాడు.
సుమారు ఐదేండ్ల పాటు Sun Risers Hyderabadకు ప్రాతినిథ్యం వహించిన ఆ జట్టు మాజీ కెప్టెన్ David Warner ఉదంతంపై సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేసే వారికి భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. వార్నర్ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచింది సన్ రైజర్స్ హైదరాబాదే కదా.. అని గుర్తు చేశాడు. ట్విట్టర్ ద్వారా స్పందించిన Irfan Pathan.. వార్నర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ ట్వీట్ లో అతడు వార్నర్ పేరుగానీ, సన్ రైజర్స్ పేరు గానీ ప్రస్తావించడకపోవడం గమనార్హం.
ట్విట్టర్ లో పఠాన్ స్పందిస్తూ.. ‘ఒక విదేశీ ఆటగాడిని రిటైన్ చేసుకునే విషయంలో ఒక ఫ్రాంచైజీ నిర్ణయంపై చాలా మంది ఆ యాజమన్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ వాళ్లందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయమేమిటంటే.. అతడి స్వంత దేశమే ఆ ఆటగాడి మీద నిషేధం విధించినప్పుడు ఆ ఫ్రాంచైజీనే అతడికి అండగా నిలిచింది. దానిని మీరు గుర్తుంచుకోవాలి..’ అని పేర్కొన్నాడు.
2017లో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఇరుక్కున్న డేవిడ్ వార్నర్ పై ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో వార్నర్ చాలా కుంగిపోయాడు. కానీ ఆ టైం లో సన్ రైజర్స్ అతడికి అండగా నిలిచింది.
కాగా.. ఇటీవలే ముగిసిన IPL-14 వార్నర్ కు పీడకలగా మిగిలింది. 2016లో సన్ రైజర్స్ తో చేరిన వార్నర్.. నాలుగు సీజన్ల పాటు ఆటగాడిగానే గాక కెప్టెన్ గా కూడా అదరగొట్టాడు. హైదరాబాద్ కు ఓ ట్రోఫీ కూడా అందజేశాడు. కానీ ఈ ఏడాది భారత్ లో జరిగిన ఐపీఎల్ తొలిదశలో అతడు దారుణంగా విఫలమయ్యాడు. అంతేగాక టీమ్ మేనేజ్మెంట్ తో కూడా వార్నర్ కు విభేదాలు వచ్చినట్టు వార్తలు వినిపించాయి. దీంతో వార్నర్ ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన సన్ రైజర్స్ యాజమాన్యం.. ఆ తర్వాత ఏకంగా జట్టు నుంచి కూడా తప్పించింది.
దీంతో ఎస్ఆర్హెచ్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. వార్నర్ ను హైదరాబాద్ వదులుకోనుందని వార్తలు బయటకు వచ్చినప్పట్నుంచీ.. ఆరెంజ్ ఆర్మీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళనలు వ్యక్తం చేశారు. ఒక్క సీజన్ ఆడనంత మాత్రానా అతడిని తీసేస్తారా..? అని ప్రశ్నించారు. కొద్దిరోజులు దీని మీద మౌనం పాటించిన వార్నర్.. ఆ తర్వాత మనసులో మాట బయటపెట్టాడు. తనను కెప్టెన్సీ నుంచి తొలగించిన విషయం కనీసం మాట మాత్రకైనా చెప్పలేదని, అసలు దానికి గల కారణాలేంటో తనకు ఇంతవరకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇక ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియకు ముందే వార్నర్ తాను హైదరాబాద్ ను వీడుతున్నట్టు ప్రకటించాడు. సన్ రైజర్స్ ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రన్ మాలిక్ లను నిలుపుకుంది. కీలక ఆటగాళ్లైన వార్నర్, రషీద్ ఖాన్ ను నిలుపుకోలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పఠాన్ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.