IPL2022 CSK vs DC: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... ధోనీ సేనకి చావో రేవో...
ఐపీఎల్ 2022: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్... ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్...
ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, నేడు ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
10 మ్యాచుల్లో 5 విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్తో పాటు 10 మ్యాచుల్లో 3 విజయాలు మాత్రమే అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్కి కూడా ఈ మ్యాచ్ ఫలితం కీలకంగా మారనుంది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, నేటి మ్యాచ్ గెలిస్తే మెరుగైన రన్రేట్ కారణంగా టాప్ 4లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది...
ఇప్పటికే 10 మ్యాచుల్లో 7 పరాజయాలు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, నేటి మ్యాచ్లో ఓడితే ముంబై ఇండియన్స్ తర్వాత అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న రెండో జట్టుగా నిలుస్తుంది.
ఎమ్మెస్ ధోనీ కెప్టెన్గా తిరిగి బాధ్యతలు అందుకున్న తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్పై విజయం అందుకున్న సీఎస్కే, గత మ్యాచ్లో ఆర్సీబీ చేతుల్లో పరాజయం పాలైంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ సంక్లిష్టం చేసుకున్న చెన్నై, మిగిలిన అన్ని మ్యాచుల్లో ఘన విజయాలు అందుకుంటే నెట్ రన్ రేట్ కారణంగా ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి అవకాశాలు ఉంటాయి...
ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పర్ఫామెన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న విషయం. సీజన్ ప్రారంభంలో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న జడేజా, ప్లేయర్గా పూర్తిగా విఫలమయ్యాడు. బ్యాటింగ్లో, బౌలింగ్లో ఫెయిల్ అవ్వడమే కాకుండా చేతుల్లోకి వచ్చిన క్యాచులను జారవిడిచాడు. ఆటపై పూర్తి ఫోకస్ పెట్టేందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా, జడ్డూ నుంచి తన రేంజ్ పర్ఫామెన్స్ అయితే రావడం లేదు...
రవీంద్ర జడేజా ఫిట్గా లేడనే కారణంగా అతన్ని జట్టు నుంచి తప్పించిన ఎమ్మెస్ ధోనీ, శివమ్ దూబేకి అవకాశం ఇచ్చాడు. సీజన్లో సీఎస్కే తరుపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రుతురాజ్ గైక్వాడ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు శివమ్ దూబే...
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ బృందాన్ని కరోనా వైరస్ వెంటాడుతూ వేధిస్తోంది. ఇప్పటికే మిచెల్ మార్ష్, టిమ్ సిఫర్ట్ వంటి ప్లేయర్లు కరోనా బారిన పడి కోలుకోగా, చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ ఆరంభానికి ముందు మరోసారి ఢిల్లీ బృందంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. నెట్ బౌలర్ కరోనా బారిన పడడంతో ఢిల్లీ ప్లేయర్లు అంతా పరీక్షల్లో పాల్గొన్నారు...
అలాగే యంగ్ సెన్సేషనల్ ఓపెనర్ పృథ్వీ షా జ్వరంతో ఆసుపత్రిలో చేరడం ఢిల్లీ క్యాపిటల్స్ని ఇబ్బందిపెట్టే విషయం. పృథ్వీ షా స్థానంలో యంగ్ వికెట్ కీపర్ కెఎస్ భరత్కి అవకాశం దొరికింది. గత సీజన్లో ఆర్సీబీ తరుపున ఆడిన తెలుగు వికెట్ కీపర్ కెఎస్ భరత్కి ఈ సీజన్లో ఇదే మొదటి మ్యాచ్..
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, మొయిన్ ఆలీ, ఎమ్మెస్ ధోనీ, శివమ్ దూబే, డ్వేన్ బ్రావో, మహీశ్ తీక్షణ, సిమర్జీత్ సింగ్, ముకేశ్ చౌదరి
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, శ్రీకర్ భరత్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, రోవ్మెన్ పావెల్, అక్షర్ పటేల్, రిపల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఆన్రీచ్ నోకియా