యూఏఈలో ఐపీఎల్: చార్టెడ్ విమానాలు బుక్ చేస్తున్న ఫ్రాంచైజీలు!
ఐసిసి వచ్చేవారంలో ప్రపంచ కప్ టోర్నీపై ప్రకటన వెలువరించిన వెంటనే ఐపిఎల్కు సన్నాహాలు ప్రారంభించేందుకు బిసిసిఐ దాదాపు సిద్ధమైంది. ఇందులో భాగంగా బిసిసిఐ.. ఐసిసి ప్రకటన కోసం మాత్రమే వేచిచూస్తోంది.
కరోనా దెబ్బకు ప్రపంచమంతా కుదేలైపోయింది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న అన్ని రంగాలు కరోనా తో కలిసి జీవించడంపై దృష్టిసారిస్తున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న క్రీడారంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. క్రికెట్ సైతం 117 రోజుల తరువాత ప్రారంభమయింది. దీనితో ఇప్పుడు సర్వత్రా ఐపీఎల్ పై ఆసక్తి మొదలయింది.
ఐసిసి వచ్చేవారంలో ప్రపంచ కప్ టోర్నీపై ప్రకటన వెలువరించిన వెంటనే ఐపిఎల్కు సన్నాహాలు ప్రారంభించేందుకు బిసిసిఐ దాదాపు సిద్ధమైంది. ఇందులో భాగంగా బిసిసిఐ.. ఐసిసి ప్రకటన కోసం మాత్రమే వేచిచూస్తోంది.
ఇదిలా ఉండగా.. బిసిసిఐనుంచి ఎలాంటి ప్రకటన రాకముందే ప్రాంచైజీలు మాత్రం ఈ ఏడాది యుఏఇలో లీగ్ ఆడటానికి బిజీగా ఉన్నారు. ఓ ఫ్రాంఛైజ్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇప్పటికే అబుదాబిలో బస చేసేందుకు అనువైన హోటళ్ల గురించి తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
''ఏదైనా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మేము అబుదాబిలో ఉండాలనుకుంటున్న హోటళ్లపై నిర్ణయం తీసుకున్నాం. యుఏఇలో అప్పటి ఆరోగ్య మార్గదర్శకాలతో మేము స్పష్టంగా ముందుకు సాగాలి'' అని ఆయన పేర్కొన్నారు.
మరో ఫ్రాంచైజీ అధికారి మాత్రం.. యుఏఇకి బయల్దేరే ముందు భారత్లో ఐసోలేషన్ కాలాన్ని పూర్తి చేయాలని చూస్తున్నట్లు, బయో-సేఫ్ వాతావరణంలో గడిపిన సమయాన్ని పరిశీలించి ఆ తరువాత కరోనా పరీక్షలు చేసిన తరువాత యుఏఇకి బయల్దేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఇక ట్రావెల్ ప్లాన్ గురించి.. మరో ఫ్రాంచైజ్ అధికారి మాట్లాడుతూ.. ఇప్పటికే కొన్ని జట్లు చార్టర్డ్ విమానాలను అద్దెకు తీసుకుంటున్నట్లు భావిస్తున్నానని, ఆగస్టు చివరి నాటికి మాకు రెగ్యులర్ విమానాలు నడుస్తాయో లేదో తెలియదు కాబట్టి ప్రయాణానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామనిరు.
చాలా జట్లు ఆగస్టు చివరి వారం, సెప్టెంబర్ మొదటి వారంలో యుఏఇకి బయల్దేరాల్సి ఉంటుందని, కాబట్టి ఇప్పటినుంచే చార్టర్డ్ విమానాలను అద్దెకు తీసుకోవడమే ఉత్తమమని భావిస్తున్న ట్లు అన్నారు.
ఓ జట్టుకు సంబంధించి 35 నుంచి 40 మంది వరకు యుఏఇకి బయల్దేరాల్సి ఉంటుందని, యజమానులు 8-10 చార్టర్డ్ ట్రిప్పులకు నగదు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ విమానాల్లో ప్రయాణం ప్రారంభం కాకపోతే ఇదే పరిస్థితిని అవలంభించాల్సి వస్తుందని ఆ అధికారి తెలిపారు