IPL Media Rights Live: భారత క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మీడియా రైట్స్ వేలం ప్రక్రియ ప్రస్తుతం ముంబైలో కొనసాగుతున్నది.
ప్రపంచంలో అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుగా ఉన్న బీసీసీఐ.. ఐపీఎల్ మీడియా హక్కుల కోసం తాను నిర్దేశించుకున్న లక్ష్యానికి అతికొద్ది దూరంలో నిలిచినట్టే కనిపిస్తున్నది. బీసీసీఐ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. ఐపీఎల్ మీడియా హక్కుల విలువ ఇప్పటికే రూ. 40 వేల కోట్లు దాటిందని తెలుస్తున్నది. 2023-2027 కాలానికి గాను ముంబైలో బీసీసీఐ వేలం ప్రక్రియ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఆదివారం మధ్యాహ్నం ముంబై లో ఇ-వేల ప్రారంభమైంది. నాలుగు ప్యాకేజీలుగా విభజించి వేలాన్ని నిర్వహిస్తున్న విషయం విదితమే. ముందుగా ఎ (ఉపఖండంలో టీవీ హక్కులు) బి (డిజిటల్ హక్కులు) విభాగాలకు వేలం నిర్వహిస్తున్నారు.
టీవీ ప్రసారం హక్కుల కోసం ఒక్కో మ్యాచ్ కు రూ. 49 కోట్లు బేస్ ప్రైజ్ గా నిర్ణయించగా.. డిజిటల్ హక్కులు రూ. 33 కోట్లుగా నిర్ణయించారు. అయితే ఇప్పటికే ఇది రూ. 100 కోట్ల మార్కు దాటిందని తెలుస్తున్నది. క్రిక్ బజ్ లో వచ్చిన సమాచారం మేరకు.. ‘ఒక్కో మ్యాచ్ విలువ రూ. 100 కోట్లు దాటింది.. బీసీసీఐకి ఇది తొలి విజయం..’ అని ఓ అధికారి వెల్లడించడం గమనార్హం. ఇక టీవీ ప్రసార హక్కుల వేలం రూ. 24 వేల కోట్లు చేరిందని.. డిజిటల్ హక్కులు రూ. 19 వేల కోట్లు దాటాయని తెలుస్తున్నది.
మొత్తానికి ఇప్పటికే ఐపీఎల్ మీడియా హక్కుల విలువ రూ. 43 వేల కోట్లు దాటిందని సమాచారం. ఈ అంకె ప్రతి అరగంటకూ పెరుగుతున్నది. ఇ-వేలం సోమవారం కూడా కొనసాగనుంది. దీనిని బట్టి చూస్తే బీసీసీఐ పెట్టుకున్న టార్గెట్ (రూ. 50వేల కోట్లు) రీచ్ అవడం పెద్ద విషయమేమీ కాదని తెలుస్తున్నది.
ప్రస్తుతం ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో డిస్నీ స్టార్, సోనీ నెట్వర్క్, వయాకామ్ రిలయన్స్ 18, జీ, ఫన్ ఆసియా, సూపర్ స్పోర్ట్, టైమ్స్ ఇంటర్నెట్ లు పోటీలో ఉన్నాయి. 2017-2022 కాలానికి గాను (డిస్నీ స్టార్) మీడియా హక్కుల ప్రారంభ ధర రూ. 16 వేల కోట్లు కాగా ఇప్పుడది ఏకంగా డబుల్ (రూ. 32 వేల కోట్లు) అయింది. పోటీ నుంచి అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు తప్పుకున్నా పోటీ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. ఇదే స్పీడ్ కొనసాగితే బీసీసీఐ.. రూ. 60 వేల కోట్లు ఆర్జించినా ఆశ్చర్యపోవాల్సిన పన్లేదంటున్నారు మార్కెట్ నిపుణులు.
