MS Dhoni: రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ధోని 350 టీ20 సిక్సర్లు కొట్టి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ తర్వాత ఈ ఘనత సాధించిన నాల్గవ ఇండియన్ బ్యాటర్ గా ఘనత సాధించాడు.

MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR) తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ ఎంఎస్ ధోని మరో ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది.ఈ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఇంకా 17 బంతులు మిగిలి ఉన్నప్పుడే టార్గెట్ ను చేధించి విజయం సాధించింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ ఈ మ్యాచ్ ఓడిపోవ‌డంతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి చేరింది.

ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. తన టీ20 కెరీర్‌లో 350వ సిక్సర్‌ను బాదాడు. ఈ ఘనత సాధించిన నాల్గవ భారత బ్యాటర్‌గా ధోనీ నిలిచాడు. అంతకు ముందు, రోహిత్ శర్మ (542), విరాట్ కోహ్లీ (434), సూర్యకుమార్ యాదవ్ (368) మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు.

మొదటి ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్లో రియాన్ పరాగ్ బౌలింగ్ లో ధోని ఈ మైలురాయిని అందుకున్నాడు.  మొత్తం మీద, క్రిస్ గేల్ 1,056 సిక్సర్లతో అత్యధిక టీ20 సిక్సర్ల రికార్డును కలిగి ఉన్నాడు. 

తుషార్ దేశ్‌పాండే చేతిలో ధోని ఔట్

మొదటి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ధోని 16(17) పరుగులతో ఔటయ్యాడు. తుషార్ దేశ్‌పాండే క్యాచ్ పట్టడంతో ధోని ఇన్నింగ్స్ ముగిసింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నైకు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ డెవాన్ కాన్వే త్వరలోనే వెనుదిరిగాడు. మరో ఎండ్ లో ఉన్న యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రే సూపర్ నాక్ ఆడాడు. కేవలం 20 బంతుల్లో 43 పరుగులతో ఆకర్షణీయ ఇన్నింగ్స్ ఆడాడు.

మిడిల్స్ ఆర్డర్‌లో డెవాల్డ్ బ్రెవిస్ 42 పరుగులు, శివమ్ దూబే 39 పరుగులు చేసి జట్టును నిలదొక్కుకునేలా చేశారు. చివర్లో ఆకాష్ మాధ్వాల్, యుద్వీర్ సింగ్ బౌలింగ్ మెరుగ్గా ఉండటంతో చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది.

188 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇంకా 17 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జట్టుకు మంచి ఆరంభాన్ని అందించిన యశస్వి జైస్వాల్ 36 పరుగులుచేసి అవుట్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడి 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగుల హాఫ్ సెంచరీ సాధించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ 41 పరుగులు, చివరలో ధ్రువ్ జురేల్ 31 నాటౌట్ గా నిలిచి రాజస్థాన్ విజయంలో కీలక ఇన్నింగ్స్ లను ఆడారు.