ఐపిఎల్ 2025 లో భాగంగా కెకెఆర్, సిఎస్కె మ్యాచ్ జరుగుతుండగా ఈడెన్ గార్డెన్స్‌కి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఇది పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'తో ఏకకాలంలో జరిగింది.

India Premier League : ఆపరేషన్ సింధూర్ వేళ భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.ఇలాంటి సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బుధవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన కలకత్తా నైట్ రైడర్స్ (కెకెఆర్), చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె) మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సిఎబి)కి ఈ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిఎబి పోలీసులకు సమాచారం అందించి మైదానంవద్ద భద్రతను మరింత పెంచారు.  

బాంబు బెదిరింపుపై సిఎబి అధ్యక్షుడు

కెకెఆర్, సిఎస్కే మ్యాచ్ సందర్భంగా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినమాట నిజమేనని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీ తెలిపారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసామని.. దర్యాప్తు జరుగుతోందని అన్నారు. ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. అందుకే ఎలాంటి అవాంతరాలు లేకుండా మ్యాచ్ సజావుగా సాగిందన్నారు. 

"కెకెఆర్, సిఎస్కే మ్యాచ్ సమయంలో సిఎబి అధికారిక ఈమెయిల్‌ ఐడికి గుర్తుతెలియని వ్యక్తులనుండి మెయిల్ వచ్చింది. దీంతో ఈడెన్ గార్డెన్స్‌లో భద్రతను పెంచాము" అని గంగూలీ తెలిపారు.

ఇటీవలి పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత జాతీయ భద్రతా ఆందోళనలు పెరిగాయి. అయితే తాజాగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సింధూర్' చేపట్టడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ సమయంలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. .

భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్‌ 

బుధవారం ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సాయుధ దళాలు తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఈ లక్ష్యాలలో నాలుగు పాకిస్తాన్‌లో ఉన్నాయి....అవి బహవల్పూర్, మురిద్కే, సర్జల్, మెహమూనా జోయా. మరో ఐదు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (పిఓకే)లో ఉన్నాయి.

ఈ ఆపరేషన్ భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం సమన్వయంతో నిర్వహించాయి. భారతదేశంపై దాడులకు పాల్పడుతున్న జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం), లష్కర్-ఎ-తైబా (ఎల్‌ఇటి) ఉగ్రవాద సంస్థల సీనియర్ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రదేశాలను ఎంచుకున్నారు.

1971 యుద్ధం తర్వాత భారతదేశం వివాదాస్పదమైన పాకిస్తాన్ భూభాగంలో దాడులను నిర్వహించింది. పాకిస్తాన్, పిఓజెకెలోని ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు ఐదు దశాబ్దాలకు పైగా సరిహద్దులో న్యూఢిల్లీ చేపట్టిన అత్యంత ముఖ్యమైన సైనిక చర్య.