IPL 2023: కొంతమంది క్రికెట్ మీద మితిమీరిన అభిమానంతో చేసే పనులు నెట్టింట నవ్వులు పూయిస్తాయి. కెమెరామెన్ తన వైపునకు తిరిగేందుకు చేసే ఈ చేష్టలు నెట్టింట వైరల్ అవుతాయి.
భారత్ లో క్రికెట్ కు ఉన్న క్రేజ్ మరే క్రీడకు ఉండదు. వయసు, జాతి, మతం, వర్గంతో పాటు లింగ బేధాలు లేకుండా ఈ ఆటకు, ఆటగాళ్లకు డై హార్ఢ్ ఫ్యాన్స్ ఉంటారు. ఆటను ఆటగా చూస్తే తప్పులేదు కానీ వింత వింత చేష్టలతో కొంతమంది ప్రజల చూపు తమ వైపునకు తిప్పుకోవడానికి చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు బ్యానర్లు, ఫ్లకార్డులు పట్టుకుని రాసే రాతలు నెట్టింట వైరల్ అవుతాయి. ఇందులో కొంతమంది ఆటను తమ సొంత జీవితాలకు అన్వయించుకుని రాసుకొచ్చేవి వేరే లెవల్ లో ఉంటాయి. అలా వేరే లెవల్ లో ఫేమస్ అవుదామని ఫ్లకార్డు పట్టిన ఓ యువతి గతేడాదితో పాటు ఈ ఏడాదీ నెట్టింట ట్రోల్స్కు గురవుతున్నది.
ఇంతకీ ఆమె ఫ్లకార్డులలో రాసుకొచ్చిన విషయమేంటంటే.. ‘ఐపీఎల్ లో ఆర్సీబీ కప్ కొట్టేదాకా నేను పెళ్లి చేసుకోను..’ ఇదీ కథ. ఇది జరిగేపనేనా..? 15 ఏండ్లుగా ఒకే కలను ప్రతీ రాత్రి ఒకే విధంగా కంటున్న (ఐపీఎల్ ట్రోఫీ విజయం) ఆర్సీబీ కరుడుగట్టిన అభిమానులు కూడా ఇలాంటి శపథాలు చేయరు.
ఐపీఎల్ లో దిగ్గజ ఆటగాళ్లు ఆడినా.. పలు సీజన్లలో ఫైనల్ కు వెళ్లినా కప్ కొట్టని ఘనత ఆర్సీబీ సొంతం. అలాంటిది ఆర్సీబీ కప్ కొట్టేదాక పెళ్లి చేసుకోనంటే అది సాహసమే అన్నారు గతేడాది. 2022లో ఈ యువతి ఫ్లకార్డు పట్టుకున్న ఫోటో వైరల్ అయినప్పుడు కూడా పలువురు ‘ఆ, అయితే నీకు జీవితంలో పెళ్లికాదు..’, ‘నువ్వు ఆజన్మ బ్రహ్మచారివే. ఇంకో ఆప్షనే లేదు..’అని కామెంట్స్ చేశారు.
పెళ్లి చేసుకుంది..
15 సీజన్లుగా కప్ కొట్టని ఆర్సీబీ అసలు ఎప్పుడు ట్రోఫీ గెలుస్తుందో లేదో తెలియదు. మరో రెండు మూడేండ్లలో ఉన్న ఒక్క స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా టాటా చెప్పేస్తే ఇక ఆ తర్వాత ఉన్న కాసిన్ని ఆశలూ ఆవిరవుతాయి. ఈ నేపథ్యంలో ఇక ఆర్సీబీ కోసం తన మంగమ్మ శపథాన్ని కావేరి నదిలో కలిపేసింది. ఒట్టు తీసి గట్టు మీద పెట్టింది. ఇటీవలే ఆమె పెళ్లి కూడా చేసుకుంది. ఈ విషయాన్ని లోకేశ్ సైనీ (విరాట్ కోహ్లీ ఫ్యాన్) తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నాడు. గతేడాది బ్యానర్ పట్టుకున్న ఆమె ఫోటోను పంచుకుంటూ.. ‘ఈమెకు పెళ్లి అయిపోయింది. మా పక్కింట్లో ఉంటుంది..’ అని రాసుకొచ్చాడు. నెల రోజుల క్రితమే ఆమె వివాహం చేసుకున్నదని తెలిపాడు.
ఈ ట్వీట్ పై కూడా ట్విటర్ లో జోకులు పేలుతున్నాయి. కొంతమంది నెటిజన్లు ఈ ఫోటోపై.. ‘ఈ ఫోటోను నువ్వు ఆమె భర్తకు చూపించు..’, ‘ఆమె రెండో పెళ్లి గురించి చెప్పినట్టుందిలే.. నువ్వు లైట్ తీస్కో..’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక ఈ సీజన్ లో ఆర్సీబీ తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ఘన విజయాన్ని అందుకున్న డుప్లెసిస్ సేన.. గురువారం కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో చిత్తుగా ఓడింది. ఈనెల 10న ఆ జట్టు లక్నోతో మ్యాచ్ ఆడనుంది.
