రాత్రిది దిగలేదనుకుంటా..! హార్ధిక్ పాండ్యా టీమ్ ను మరిచిపోయిన రవిశాస్త్రి.. వీడియో వైరల్
IPL 2023: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో తొలి మ్యాచ్ కు ముందు పప్పులో కాలేశాడు. హార్ధిక్ పాండ్యా టీమ్ పేరు తప్పుగా చెప్పాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా ముగిసిన తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి బోణీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ కు ముందు నిర్వహించిన టాస్ లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టాస్ కోసం వచ్చిన హార్ధిక్ పాండ్యా, ధోనిలతో పాటు నరేంద్ర మోడీ స్టేడియం లోని ప్రేక్షకులు, టీవీలు, మొబైల్ తెరల ముందు కోట్లాది ప్రేక్షకులు చూస్తుండగానే ‘గుజరాత్ టైటాన్స్’ పేరును తప్పుగా పలికాడు.
సాధారణంగా రవిశాస్త్రి కామెంట్రీ అంటేనే రెడ్ బుల్ తాగిన రేసుగుర్రంలా ఉంటుంది. మ్యాచ్ ను మరింత రసవత్తరంగా మార్చడంలో ఆయనది ప్రత్యేక శైలి. 2007 టీ20 ప్రపంచకప్ లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు కొట్టినప్పుడైనా 2011 వన్డే వరల్డ్ కప్ లో ధోని సిక్సర్ కొట్టి భారత్ ను గెలిపించినప్పుడైనా వినిపించే శాస్త్రి మాటలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.
ఇక ఐపీఎల్ - 16 లో తొలి మ్యాచ్ లో కూడా టాస్ వేసేందుకు వచ్చిన రవిశాస్త్రి.. ‘అహ్మదాబాద్ వాసులారా ఎలా ఉన్నారు..? మజా వస్తుందా..? రండి.. ఇది టాస్ టైమ్’ అని తన స్టైల్ లో బిగ్గరగా అరిచి.. ఆ తర్వాత ఐపీఎల్ పదహారేండ్ల ప్రయాణాన్ని రెండు ముక్కల్లో వర్ణించాడు. అనంతరం ‘ఈ లీగ్ లో టాస్ తొలి సారి పడబోతుంది. హార్ధిక్ పాండ్యా.. గుజరాత్ జెయింట్స్ కెప్టెన్.. ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్. మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్..’అని చెప్పుకుంటూ పోతున్నాడు. అయితే గుజరాత్ జెయింట్స్ టీమ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లోనిది. ఐపీఎల్ లో పాండ్యా సారథ్యం వహించేది గుజరాత్ టైటాన్స్ కు. శాస్త్రి గుజరాత్ జెయింట్స్ అని చెప్పినప్పుడు స్టేడియం కూడా హోరెత్తగా పాండ్యా కూడా నవ్వుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
కాగా శాస్త్రి పాండ్యా టీమ్ ను మరిచిపోవడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఏంటి శాస్త్రి.. రాత్రిది దిగలేదా..? లేక మ్యాచ్ ఉందని ఈవినింగ్ కూడా ఓ పెగ్ వేసుకున్నావా..?’ ‘డబ్ల్యూపీఎల్ హ్యాంగ్ ఓవర్’, ‘ఇది కచ్చితంగా అదే.. దాని ఎఫెక్టే..’అని కామెంట్స్ చేస్తున్నారు.