IPL 2023: ముంబై - పంజాబ్ మధ్య వాంఖెడే వేదికగా శనివారం ముగిసిన మ్యాచ్ లో అర్ష్దీప్ సింగ్ చివరి ఓవర్ వేసి రెండుసార్లు ఎల్ఈడీ స్టంప్స్ ను విరగ్గొట్టాడు. దీనిపై సోషల్ మీడియాలో వార్ నడుస్తున్నది.
పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్దీప్ సింగ్ నిన్న రాత్రి చేసిన పనికి ముంబై ఇండియన్స్ - పంజాబ్ అభిమానులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇరు జట్ల అభిమానులతో పాటు టీమ్స్ ట్విటర్ ఖాతాలు చూసే అడ్మిన్లు కూడా కత్తులు దూసుకుంటున్నారు. ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ముంబై పోలీసుల వద్దకు చేరింది. ముంబై పోలీసులు కూడా ఈ విషయంలో ఏం తక్కువ తిన్లేదు.
అసలేం జరిగిందంటే.. ముంబై - పంజాబ్ మధ్య వాంఖెడే వేదికగా శనివారం ముగిసిన మ్యాచ్ లో అర్ష్దీప్ సింగ్ చివరి ఓవర్ వేసి రోహిత్ సేన 16 పరుగులు చేయకుండా అడ్డుకోవడమే గాక తాను విసిరిన యార్కర్ల వేగానికి రెండు సార్లు మిడిల్ స్టంప్స్ విరిగిపోయాయి. తిలక్ వర్మ, వధేరా లు అర్ష్దీప్ యార్కర్లు ఆడలేక మిస్ చేయడంతో బాల్ వెళ్లి ఎల్ఈడీ స్టంప్స్ ను విరగ్గొట్టింది.
అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్.. అర్ష్దీప్ సింగ్ మ్యాచ్ లో వికెట్లను విరగ్గొట్టిన ఫోటోను జతచేసి.. ‘హే ముంబై పోలీస్. మేం ఇక్కడ ఒక నేరం జరిగింది. దానిపై రిపోర్టు ఇవ్వాలనుకుంటున్నాం..’ అని ట్వీట్ చేసింది. దీనికి ముంబై పోలీసుల అధికారిక ట్విటర్ ఖాతా కూడా రిప్లై ఇచ్చింది. ‘మేం చట్టాన్ని అతిక్రమించేవారిమీదే చర్యలు తీసుకుంటాం గానీ స్టంప్స్ విరిగితే కాదు’అని పేర్కొంది. మరికొంతసేపటికి. ‘భారత్ లో పౌరులకు ఆధార్ కార్డు ఎంత అవసరమో.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే ట్రోఫీ గెలిచుండాలి..’అని ఎపిక్ రిప్లై ఇచ్చింది. దీంతో అభిమానులు పంజాబ్ కింగ్స్ అడ్మిన్ ను ఉద్దేశిస్తూ.. ‘అయిందా.. బాగయిందా.. ప్రతీ దానికి ఓవర్ ఎక్స్పెక్టేషన్...’అని చురకలంటిస్తున్నారు.
ఇదిలాఉంచితే ముంబై ఇండియన్స్ ట్విటర్ పేజీ కూడా పంజాబ్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. ‘హే ముంబై పోలీస్.. మేం మీకు ఓ మిస్సింగ్ కంప్లయింట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. పీబీకేఎస్ 15 ఏండ్ల నుంచి ఐపీఎల్ ట్రోఫీని మిస్ అవుతోంది. దీనిపై మీరు కంప్లయింట్ తీసుకోవాలి’అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ను పంజాబ్ కే చెందినవాడైన టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేస్తూ.. ‘ఎపిక్ రిప్లై’అని రాసుకొచ్చాడు.
అయితే ఇది ముంబై ఇండియన్స్ అధికారిక ఖాతా కాదు. ఎవరో ఫ్యాన్ క్రియేట్ చేసింది. కానీ భజ్జీ పంజాబ్ కు చెందిన వ్యక్తి అయ్యుండి ముంబైకి సపోర్ట్ చేయడం ఆ జట్టు అభిమానులకు నచ్చలేదు. ఈ ట్వీట్ల కింద ఇరు జట్ల అభిమానులు వాదాలు, ప్రతివాదాలతో మరింత హీట్ పెంచుతున్నారు. అర్ష్దీప్ తెలిసి చేశాడో తెలియక చేశాడో గానీ ఈ కామెంట్స్ చదివితే వికెట్లు విరగ్గొట్టినందుకు అతడు కూడా బాధపడేంత దారుణంగా మీమ్స్, ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.
