సారాంశం
వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయితే గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరే ఛాన్స్... మరోసారి హార్ధిక్ పాండ్యా టీమ్కి రెయిన్ అడ్వాంటేజ్..
ఐపీఎల్ 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్కి మరోసారి వర్షం కలిసి వచ్చేలా కనిపిస్తోంది. బెంగళూరులో ఆర్సీబీతో ఆఖరి లీగ్ మ్యాచ్కి పడిన వర్షం, టైటాన్స్కి 10వ విజయాన్ని అందించింది. ఇప్పుడే అదే వర్షం, గుజరాత్ టైటాన్స్ని ఫైనల్ చేర్చే అవకాశం ఉంది..
ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా నేడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జరగుతోంది. రెండో క్వాలిఫైయర్కి ముందు అహ్మదాబాద్లో భారీ వర్షం కురిసింది.
వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయితే రిజర్వు డే లేనందున లీగ్ స్టేజీలో 10 విజయాలు అందుకున్న గుజరాత్ టైటాన్స్, ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ చేరుతుంది. లీగ్ స్టేజీలో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచులు జరగగా చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో ఒకవేళ వర్షం తగ్గి మ్యాచ్ సజావుగా సాగితే నేటి మ్యాచ్లో గెలిచిన జట్టు, ఇదే గ్రౌండ్లో మే 28న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే ఫైనల్కి అర్హత సాధిస్తుంది. నేటి మ్యాచ్లో ఓడిన జట్టు,మూడో స్థానంతో ఐపీఎల్ 2023 సీజన్ని ముగిస్తుంది.
వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అవుతోంది. 9 గంటల 40 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమైనా పూర్తి ఓవర్ల పాటు జరుగుతుంది. అప్పటికీ మ్యాచ్ ప్రారంభం కాకపోతే ఓవర్లు తగ్గుతూ పోతాయి. 11 గంటల 56 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమైనా చెరో 5 ఓవర్ల పాటు మ్యాచ్ని నిర్వహిస్తారు..
అదీకూడా వీలు కాకపోతే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ రిజల్ట్ని తేలుస్తాయి. 12 దాటిన తర్వాత కూడా సూపర్ ఓవర్ పెట్టే అవకాశం ఉంది. అదీకూడా వీలు కాకపోతేనే గుజరాత్ టైటాన్స్, లీగ్ స్టేజీలో టేబుల్ టాపర్గా నిలిచిన కారణంగా ఫైనల్ చేరుతుంది.
లీగ్ స్టేజీలో 14 మ్యాచుల్లో 10 విజయాలు అందుకుని టేబుల్ టాపర్గా ప్లేఆఫ్స్కి అర్హత సాధించింది గుజరాత్ టైటాన్స్. ఇరు జట్ల మధ్య ఇంతకుముందు 3 మ్యాచులు జరగగా రెండు మ్యాచుల్లో ముంబై ఇండియన్స్, ఓ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ గెలిచాయి.
గత సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 5 పరుగుల తేడాతో గెలిచింది ముంబై ఇండియన్స్. 2023 సీజన్లో జరిగిన మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 27 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే అహ్మదాబాద్లో జరిగిన రెండో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 55 పరుగుల తేడాతో గెలిచింది..
ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్లపైనే ప్రధానంగా ఆధారపడింది. సూర్య ఈ సీజన్లో 544 పరుగులు చేస్తే, ఇషాన్ కిషన్ 454 పరుగులు చేశాడు. కామెరూన్ గ్రీన్ 422 పరుగులతో ఉన్నాడు..
ఐపీఎల్ 2023 సీజన్లో 15 మ్యాచుల్లో 722 పరుగులు చేసిన శుబ్మన్ గిల్, మరో 9 పరుగులు చేస్తే ఫాఫ్ డుప్లిసిస్ (730 పరుగులు) ని అధిగమించి ఆరెంజ్ క్యాప్ గెలిచే అవకాశం దక్కించుకుంటాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ఇప్పటికే ఐపీఎల్ 2023 సీజన్ నుంచి తప్పుకున్నారు. ఐదో స్థానంలో ఉన్న డివాన్ కాన్వే, ఆరో స్థానంలో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ దక్కించుకోవడం చాలా కష్టమైన పని..
625 పరుగులు చేసిన డివాన్ కాన్వే, ఆరెంజ్ క్యాప్ గెలవాలంటే ఫైనల్ మ్యాచ్లో సెంచరీకి పైగా పరుగులు చేయగా రుతురాజ్ గైక్వాడ్ 574 పరుగులే చేశాడు. అతను ఆరెంజ్ క్యాప్ గెలవాలంటే 165 పరుగులు చేయాలి. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ కలిసి ఈ సీజన్లో ఇప్పటికే 51 వికెట్లు తీశారు..
గత మ్యాచ్లో 5 వికెట్లు తీసి అదరగొట్టిన ఆకాశ్ మద్వాల్తో పాటు పియూష్ చావ్లా, ముంబై ఇండియన్స్కి కీ బౌలర్గా మారాడు. అత్యంత పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉన్న గుజరాత్ టైటాన్స్ని, ధృడమైన బ్యాటింగ్ లైనప్, అనుభవం లేని బౌలింగ్ యూనిట్ ఉన్న ముంబై ఇండియన్స్ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది..
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా పెద్దగా ఫామ్లో లేరు.