IPL 2023: ఐపీఎల్ -2023లో ఇదివరకే పలు ఫ్రాంచైజీలు ఒక మ్యాచ్ కోసం తమ రెగ్యులర్ జెర్సీలలో కాకుండా డిఫరెంట్ కలర్ జెర్సీలలో దర్శనమిచ్చారు.
ఐపీఎల్ -16 ప్లేఆఫ్స్ రేసులో భాగంగా ఇటీవలే ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలక పోరులో ఐదు సార్లు ఛాంపియన్స్ ను ఓడించి టాప్ - 3 కి దూసుకెళ్లిన లక్నో సూపర్ జెయింట్స్ తాము ఈ సీజన్ లో తర్వాత ఆడబోయే ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఆ జట్టు తమ రెగ్యులర్ జెర్సీ (బ్లూ కలర్) లలో కాకుండా మరో రంగు దుస్తులలో అలరించబోతున్నారు.
కోల్కతా నైట్ రైడర్స్ తో లక్నో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో లక్నో ఆటగాళ్లు.. దేశంలో ప్రముఖ ఫుట్బాల్ ఫ్రాంచైజీ అయిన ఏటీకే మోహన్ బగన్ ఆటగాళ్లు ధరించే జెర్సీని వేసుకోనున్నారు.
ఈ మేరకు లక్నో తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. మే 20న ఈడెన్ గార్డెన్ వేదికగా లక్నో.. కేకేఆర్ తో మ్యాచ్ ఆడనుంది. కాగా మోహన్ బగన్ ఫ్రాంచైజీ ఓనర్, ఐపీఎల్ లో లక్నో టీమ్ ఓనర్ ఇద్దరూ ఒకరే కావడం విశేషం. ఈ రెండు టీమ్స్ కు సంజీవ్ గొయెంకా యజమాని. మోహన్ బగన్ టీమ్ కు ట్రిబ్యూట్ ఇచ్చేందుకే వాళ్ల జెర్సీని వేసుకుంటున్నట్టు లక్నో ఒక ప్రకటనలో తెలిపింది.
మెరూన్, గ్రీన్ కలర్ మిక్స్ లలో ఉండే ఈ జెర్సీ వేసుకోవడానికి లక్నో టీమ్ కు మరో సందర్భం కూడా ఉంది. ఈ మ్యాచ్ జరిగేది కోల్కతాలో.. మోహన్ బగన్ ఫ్రాంచైజీకి కూడా కోల్కతాతో విడదీయరాని అనుబంధముంది. అదీగాక కోల్కతా నైట్ రైడర్స్ కు రెండు ఐపీఎల్ ట్రోఫీలను అందించిన సారథి గౌతం గంభీర్ ఇప్పుడు లక్నోకు మెంటార్ గా వ్యవహరిస్తుండటం గమనార్హం.
ఈ సీజన్ లో ఒక టీమ్ జెర్సీని మార్చి ఆడటం ఇదే ప్రథమం కాదు. ఐపీఎల్ -16 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ లో తమ గ్రీన్ జెర్సీని వేసుకుని మ్యాచ్ ఆడింది. ముంబై కూడా ఓ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ముంబై ఇండియన్స్ మహిళల జెర్సీని వేసుకుంది. ఇటీవలే గుజరాత్ టైటాన్స్ కూడా సన్ రైజర్స్ తో మ్యాచ్ లో లావెండర్ జెర్సీని వేసుకుని ఆడింది. ఈ క్రమంలో ఇప్పుడు లక్నో కూడా చేరింది.
