IPL 2023: ఐపీఎల్ -16 లో మరో టీమ్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్ లో జెర్సీని మార్చనున్నది. చెన్నైతో ఆఖరి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్..
ఐపీఎల్ -16 లో వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడి అన్ని జట్ల కంటే ముందే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఢిల్లీ క్యాపిటల్స్.. పోతూ పోతూ మొన్న పంజాబ్ కింగ్స్ ను కూడా తమతో పాటు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇక తమ చివరి లీగ్ మ్యాచ్ లో భాగంగా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఝలక్ ఇచ్చేందుకు వార్నర్ సేన రెడీ అయింది. తమ చివరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ.. మే 20న సొంత వేదిక (అరుణ్ జైట్లీ స్టేడియం) పై చెన్నైని ఢీకొననుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ తమ రెగ్యులర్ జెర్సీలో కాకుండా ప్రత్యేక జెర్సీలలో దర్శనమివ్వనుంది.
చెన్నైతో మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు.. ‘రెయిన్ బో జెర్సీ’ని వేసుకోనున్నారు. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఢిల్లీ ఆటగాళ్లు వేసుకునే రెగ్యులర్ జెర్సీ కలర్ మీదే ఏడు రంగుల చారలు ఉండే విధంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన జెర్సీని వేసుకోనున్నారు.
అయితే ఈ జెర్సీని వేసుకోవడానికి గల ప్రత్యేకమైన కారణాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం.. ‘రెయిన్ బో కలర్ స్వలింగ సంపర్కులకు చిహ్నంగా ఉంది. వారికి మద్దతుగానే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ జెర్సీని వేసుకోనుంది’ అన్న చర్చ సాగుతోంది. దీనిపై ఢిల్లీ అధికారిక ప్రకటన చేయలేదు. ఈ మ్యాచ్ తోనే ఐపీఎల్ - 16 లో ఢిల్లీ క్యాపిటల్స్ తన క్యాంపెయిన్ ను ముగించనున్నది. గతేడాది కూడా ఢిల్లీ.. తమ చివరి లీగ్ మ్యాచ్ లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో పోరులో రెయిన్ బో జెర్సీని వేసుకుంది.
ఇక ఢిల్లీతో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కూడా తమ ఆఖరి లీగ్ మ్యాచ్ లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో (ఇది కూడా మే 20నే) ప్రముఖ ఫుట్బాల్ ఫ్రాంచైజీ ఎటికె మోహన్ బగాన్ ఆటగాళ్లు వేసుకునే జెర్సీ (మెరూన్, గ్రీన్ కలర్) ని వేసుకోనున్నారు. మోహన్ బగాన్, లక్నో సూపర్ జెయింట్స్.. ఈ రెండింటి ఓనర్ ఒక్కరే (సంజీవ్ గొయెంకా) కావడం గమనార్హం.
ఈ సీజన్ లో ఆర్సీబీ, ముంబై, గుజరాత్ టైటాన్స్ కూడా ఒక మ్యాచ్ లో ప్రత్యేకమైన జెర్సీలో ఆడిన విషయం విదితమే.
