ఐపీఎల్ 2022 సీజన్లో మూడు నిమిషాల పాటు స్ట్రాటెజిక్ టైమ్ అవుట్... మరో 30 సెకన్లు అదనంగా వ్యాపార ప్రకటనలు వేసుకునేందుకు బ్రాడ్ కాస్టింగ్ ఛానెళ్లకు అవకాశం...
ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా బీసీసీఐకి వేల కోట్ల అదనపు ఆదాయం రానుంది. ఇప్పటికే రెండు అదనపు జట్లను లీగ్లో చేర్చి రూ.12 వేల కోట్లకు పైగా ఆర్జించిన బీసీసీఐ, బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అమ్మకం ద్వారా మరో రూ.40-45 వేల కోట్లు ఆర్జించబోతోంది...
ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలుగా స్ట్రాటెజిక్ టైమ్ అవుట్ సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుందట బీసీసీఐ. సాధారణంగా ఒక ఇన్నింగ్స్లో రెండు సార్లు (సాధారణంగా పవర్ ప్లే ముగిసిన తర్వాత) స్ట్రాటెజిక్ టైమ్ అవుట్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తారు...
మ్యాచ్ మధ్యలో వ్యూహ, ప్రతివ్యూహాలను సమీక్షించుకునేందుకు, పరిస్థితిని బట్టి అనుసరించాల్సిన సరికొత్త వ్యూహాల గురించి చర్చించుకునేందుకు వీలుగా స్ట్రాటెజిక్ టైమ్ అవుట్ ఉంటుంది...
ఇంతకుముందు 150 సెకన్ల పాటు (రెండున్నర నిమిషాలు) స్ట్రాటెజిక్ టైమ్ అవుట్ రూపంలో ఆటకు బ్రేక్ లభించేది. ఇప్పుడు దాన్ని మూడు నిమిషాలకు (180 సెకన్లు) నిర్ణయం తీసుకున్నారు ఐపీఎల్ యాజమాన్యం...
అంటే మూడు నిమిషాల పాటు నిరంతరాయంగా ప్రకటనలు వేసుకునేందుకు బ్రాడ్ కాస్టింగ్ ఛానెళ్లకు అవకాశం దక్కుతుంది. మరో 30 సెకన్ల పాటు దక్కే అదనపు సమయం, అటు బ్రాడ్ కాస్టింగ్ ఛానెళ్లకు, ఇటు బీసీసీఐకి కాసుల పంట కురిపించనుంది...
10 ఫ్రాంఛైజీలు పాల్గొనబోయే ఐపీఎల్ 2022 సీజన్... మార్చి 26న మొదలుకానుంది. దాదాపు రెండున్నర నెలల పాటు సుదీర్ఘంగా సాగే 15వ సీజన్, మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది...
ఐపీఎల్ 2022 లీగ్ మ్యాచులన్నీ మహారాష్ట్రలోని ముంబై, పూణే నగరాల్లో నిర్వహించబోతోంది బీసీసీఐ. ఐపీఎల్ మ్యాచుల సన్నాహకాల కోసం మార్చి 8 నాటి కల్లా ముంబై చేరుకుని, క్యాంపులు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఫ్రాంఛైజీలకు ఇప్పటికే సూచించింది భారత క్రికెట్ బోర్డు...
రెండు వేర్వేరు గ్రూపులుగా జట్లను విడదీసి ఐపీఎల్ 2022 లీగ్ మ్యాచులు నిర్వహించనున్నారు. గ్రూప్ ఏలో ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రెండు టైమ్ ఛాంపియన్ కోల్కత్తా నైట్రైడర్స్తో పాటు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఉన్నాయి...
గ్రూప్ బీలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి...
ఒకే గ్రూప్లో ఉన్న జట్లతో రెండేసి మ్యాచులు ఆడే ప్రతీ ఫ్రాంఛైజీ, మరో గ్రూప్లో ఉన్న నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. మరో జట్టుతో రెండు మ్యాచులు ఆడుతుంది...
గ్రూప్ బీలో ఉన్న ఆర్సీబీ... చెన్నై, సన్రైజర్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్తో రెండేసి మ్యాచులు ఆడుతుంది...
గ్రూప్ ఏలో ఉన్న రాజస్థాన్ రాయల్స్తో రెండు మ్యాచులు ఆడే ఆర్సీబీ... ముంబై ఇండియన్స్, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది...
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రెండేసి మ్యాచులు జరగబోతుండగా కేకేఆర్- సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్- పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రెండేసి మ్యాచులు జరుగుతాయి.
