IPL 2022: ఈ సీజన్ లోనే అత్యంత కీలక మ్యాచ్.. ఢిల్లీ-బెంగళూరు భవితవ్యం తేలే పోరులో టాస్ నెగ్గిన ముంబై..
TATA IPL 2022 MI vs DC: ఐపీఎల్ ప్లేఆఫ్ దశకు వెళ్లే నాలుగో జట్టు ఏదో నేడు స్పష్టత రానున్నది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖెడే వేదికగా నేడు ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ తలపడబోతున్నాయి.
ఐపీఎల్-15 సీజన్ లో అన్ని వన్ సైడ్ మ్యాచులు, పెద్దగా ఆసక్తి కలిగించని.. అసలు ఉత్కంఠే లేని మ్యాచులను చూసిన క్రికెట్ అభిమానులకు నేటి రాత్రి పండుగ తేవడానికి రెండు జట్లు సిద్ధపడ్డాయి. వాంఖెడే వేదికగా ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ లు నేడు కీలక పోరులో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో నెగ్గితేనే ఢిల్లీ.. ప్లేఆఫ్ కు చేరుకునే నాలుగో జట్టు అవుతుంది. ఒకవేళ ముంబై గెలిస్తే మాత్రం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ప్లేఆఫ్ కు అర్హత సాధిస్తుంది. కాగా నేటి మ్యాచ్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్.. టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేయనుంది.
ఈ మ్యాచ్ కోసం ముంబై ఎంత సీరియస్ గా ఉందో తెలియదు గానీ.. ఆర్సీబీ మాత్రం దాని సొంత మ్యాచులకన్నా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ముంబై మ్యాచ్ నెగ్గాలని ఆర్సీబీ కోరుకుంటున్నది.
పాయింట్ల పట్టికలో ఆర్సీబీ.. (14 మ్యాచులలో 8 నెగ్గి.. 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది) నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ దాని నెట్ రన్ రేట్ (-0.253) మైనస్ లలో ఉంది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్.. (13 మ్యాచులలో 7 నెగ్గి.. 14 పాయింట్లు) ఐదో స్థానంలో ఉంది. అయితే ఢిల్లీ నెట్ రన్ రేట్ (+0.255) ఆర్సీబీ కంటే మెరుగ్గా ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలిచి.. ఆర్సీబీ తో పాయింట్లు సమంగా ఉన్నా.. నెట్ రన్ రేట్ తో రిషభ్ పంత్ సేన ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఢిల్లీ ఓడితే గనక మిగతా సమీకరణాలతో సంబంధం లేకుండా ఆర్సీబీ ప్లేఆఫ్ కు అర్హత సాధిస్తుంది.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, రమణ్దీప్ సింగ్, డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, డానియల్ సామ్స్, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరిడిత్, మయాంక్ మార్కండే
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్), రోవ్మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్త్జ్, ఖలీల్ అహ్మద్