ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ టిమ్ సిఫర్ట్‌కి కరోనా పాజిటివ్... ఇప్పటికే కరోనా కారణంగా టీమ్‌కి దూరమైన మిచెల్ మార్ష్... సజావుగా సాగనున్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ని కరోనా వైరస్ వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే టీమ్ ఫిజియో ప్యాట్రిక్ ఫార్‌హర్ట్‌ కరోనా పాజిటివ్‌గా తేలగా లేటుగా జట్టుతో చేరిన ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ కూడా రెండు రోజుల కిందట కరోనా బారిన పడ్డాడు...

మిచెల్ మార్ష్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మసాజర్ ఛేతన్ కుమార్, డాక్టర్ అభిజిత్ సల్వీ, సోషల్ మీడియా మేనేజర్ ఆకాశ్ మానేలకు కరోనా పాజిటివ్ వచ్చింది. వీరందరికీ బుధవారం ఉదయం నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. అయితే మరో ఐదు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండబోతున్నారు వీరంతా... 

షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ కోసం పూణే బయలుదేరి వెళ్లాల్సి ఉంది. అయితే ఢిల్లీ ప్లేయర్లు రెండు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండడంతో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వేదికను పూణే నుంచి నేవీ ముంబైకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు ఐపీఎల్ నిర్వాహకులు...

మ్యాచ్ ఆరంభానికి ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సిఫర్ట్‌కి పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఆన్రీచ్ నోకియా ఫిట్‌నెస్ సమస్యలతో జట్టుకి దూరంగా ఉన్నాడు. దీనికి తోడు కరోనా కారణంగా ఇద్దరు ఫారిన్ ప్లేయర్లు దూరం కావడం ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది...

టిమ్ సిఫర్ట్‌కి కరోనా పాజిటివ్ వచ్చినా, క్వారంటైన్‌లో ఉన్న మిగిలిన ప్లేయర్లకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ రావడంతో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సజావుగా షెడ్యూల్ ప్రకారం సాగనుంది.

మిచెల్ మార్ష్ కారణంగా రెండు మ్యాచులాడి ఒకే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకున్న యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్... నేటి మ్యాచ్‌లో బరిలో దిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆన్రీచ్ నోకియా గాయం కారణంగా జట్టుకి దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై తీవ్రంగా ప్రభావం చూపించింది.

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా 5 మ్యాచులు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్, రెండు విజయాలు అందుకుని... మూడు మ్యాచుల్లో పరాజయం పాలైంది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 9 మ్యాచుల్లో కనీసం 6 మ్యాచుల్లో విజయం సాధించాల్సి ఉంటుంది...

మరోవైపు పంజాబ్ కింగ్స్ ఇప్పటిదాకా 6 మ్యాచులు ఆడి మూడు విజయాలు, మూడు పరాజయాలు అందుకుంది. గత మ్యాచ్‌లో గాయం కారణంగా బరిలో దిగని మయాంక్ అగర్వాల్, నేటి మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో తాత్కాలిక సారథిగా వ్యవహరించిన శిఖర్ ధావన్, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. శిఖర్ ధావన్ నేటి మ్యాచ్‌లో ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా మారింది...

గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక సభ్యులుగా ఉన్న కగిసో రబాడా, శిఖర్ ధావన్... నేటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున బరిలో దిగబోతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన వీరిపై భారీ అంచనాలే పెట్టుకుంది పంజాబ్ కింగ్స్...