TATA IPL 2022 - DC vs RR: రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ ఆడబోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ లేకుండానే రిషభ్ పంత్ సేన బరిలోకి దిగనుంది. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాంప్ లో కరోనా కేసులు ఏడుకు పెరగడం ఆందోళనకు గురి చేస్తున్నది.
ఢిల్లీ క్యాపిటల్స్ ను కరోనా కలవరపెడుతున్నది. ఇప్పటికే ఆ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు, మరో నలుగురు ఇతర సిబ్బంది ఈ మహమ్మారి బారీన పడగా.. తాజాగా ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కుటుంబ సభ్యులలో ఒకరికి కరోనా పాజిటివ్ గా వచ్చింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో అతడు నేడు రాజస్తాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ కు దూరంగా ఉంటాడని యాజమాన్యం తెలిపింది.
తన కుటుంబంలో ఒక వ్యక్తికి (పేరు వెల్లడించలేదు) కరోనా పాజిటివ్ తేలడంతో పాంటింగ్ జట్టుకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. ప్రస్తుతం అతడు ఐసోలేషన్ కు వెళ్లాడు. అయితే తన కుటుంబంలో వ్యక్తికి పాజిటివ్ గా తేలినా పాంటింగ్ మాత్రం రెండు సార్లు పరీక్ష చేయించుకోగా.. అందులో అతడికి నెగిటివ్ గా తేలింది.
ఇదే విషయమై ఢిల్లీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్ గా తేలింది. అయితే అతడికి రెండు సార్లు నెగిటివ్ వచ్చింది. అయితే జట్టు ప్రయోజనాల దృష్ట్యా అతడు ఐసోలేషన్ లో ఉండనున్నాడు..’ అని రాసుకొచ్చింది. గత మ్యాచ్ లో మిచెల్ మార్ష్ తో పాటు టిమ్ సీఫర్ట్ కూడా కరోనా బారిన పడటంతో ఢిల్లీ డగౌట్ లో అందరూ ముఖానికి మాస్కులు పెట్టుకుని కనిపించారు.
ఢిల్లీ క్యాపిటల్స్ లో ఇప్పటివరకు కోవిడ్ వచ్చినవాళ్ల జాబితా :
- పాట్రిక్ ఫర్హర్ట్ : ఫిజియోథెరఫిస్టు (ఏప్రిల్ 15న కరోనా సోకింది. ఐపీఎల్ లో తొలి కరోనా బాధితుడు ఫర్హర్టే..)
- చేతన్ కుమార్ : స్పోర్ట్స్ మసాజ్ థెరపిస్ట్.. (ఏప్రిల్ 16న)
- మిచెల్ మార్ష్ : ఢిల్లీ ఆల్ రౌండర్.. (ఏప్రిల్ 18న)
- డాక్టర్ అభిజిత్ సాల్వి : టీమ్ డైరెక్టర్.. (ఏప్రిల్ 18న)
- ఆకాశ్ మనే : సోషల్ మీడియా కంటెంట్ టీమ్ మెంబర్ (ఏప్రిల్ 18న)
- టిమ్ సీఫర్ట్ : ఢిల్లీ జట్టులో ఆటగాడు (ఏప్రిల్ 20 న)
- రికీ పాంటింగ్ కుటుంబ సభ్యులలో ఒకరు (ఏప్రిల్ 22)
కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ లో వరుసగా కరోనా కేసులు వెలుగు చూస్తుండటంతో ఈ జట్టు ట్రావెల్ చేయడాన్ని బీసీసీఐ నిషేధించింది. రెండ్రోజుల క్రితం పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ఆడిన ఢిల్లీ.. షెడ్యూల్ ప్రకారమైతే ఈ మ్యచ్ ను పూణేలో ఆడాల్సి ఉంది. కానీ దీనిని బ్రబోర్న్ (ముంబై)లో ఆడించారు. ఇక ఢిల్లీ - రాజస్తాన్ మ్యాచ్ కూడా పూణేలోనే జరగాల్సి ఉండగా.. ఈ మ్యాచ్ ను వాంఖెడే కు మార్చారు.
