సింగిల్ ఓవర్ లో ఆరు ఫోర్లు.. తన ప్లాన్ బయటపెట్టిన పృథ్వీ షా
తొలి ఇన్నింగ్స్ తొలి ఓవర్లో షా కొట్టిన ఆరు బౌండరీలు అపురూపమే. కేకేఆర్ పేసర్ శివం మావి వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో 6 బంతులను ఫోర్లుగా మలిచి కేకేఆర్పై ఒత్తిడి పెంచాడు.
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా.. ఐపీఎల్ లో సత్తా చాటుతున్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ తనదైన స్టైల్ లో ఆడుతూ.. ప్రత్యర్థి టీం ని బెంబేలెత్తిస్తున్నాడు. తాజాగా.. గురువారం జరిగిన మ్యాచ్ లో.. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ గా స్టేడియంలోకి అడుగుపెట్టిన పృథ్వీ షా.. బ్యాట్ తో విజృంభించాడు.
గురువారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా శివాలెత్తిపోయాడు. మొత్తం 41 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్తో 82 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం రాణించడంతో కేకేఆర్పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ జట్టు ఘన విజయం సాధించింది. అయితే తొలి ఇన్నింగ్స్ తొలి ఓవర్లో షా కొట్టిన ఆరు బౌండరీలు అపురూపమే. కేకేఆర్ పేసర్ శివం మావి వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో 6 బంతులను ఫోర్లుగా మలిచి కేకేఆర్పై ఒత్తిడి పెంచాడు.
మ్యాచ్ అనంతరం పృథ్వీ షా మాట్లాడుతూ.. ‘వాస్తవానికి ఇలా ఆడాలి అని నేను ప్లాన్ చేసుకోలేదు. చెత్త బంతులు పడితే వదలకూడదని నిర్ణయించుకున్నాను శివం మావితో కలిసి నాలుగైదేళ్లు క్రికెట్ ఆడిన అనుభవం నాకు ఉంది. తొలి నాలుగు బంతులు హాఫ్ వ్యాలీ వేశాడు. నేనేమో షార్ట్ బాల్ కోసం ఎదురుచూశాను. ఒకవేళ స్పిన్నర్ బౌలింగ్ అయితే బంతి బ్యాట్ మీదకు రాదు. పేసర్ కావడంతో నా పని తేలిక అయింది. ఆఫ్ స్టంప్, ఆఫ్ స్టంప్ వెలుపలకు బంతులు వేస్తే నాకు షాట్లు కొట్టడం తేలిక అవుతుంది. నేను నా స్కోరు గురించి ఏమాత్రం పట్టించుకోను. కేవలం చెత్త బంతులను బౌండరీలకు తరలించడం నా పని’ అంటూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హీరో 21 ఏళ్ల పృథ్వీ షా వెల్లడించాడు.