IPL 2021 RCB vs DC: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆఖరిపోరులో  ఢిల్లీ బాయ్స్ తడబడ్డారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు అదరగొట్టినా మిడిలార్డర్ తడబడటంతో ఆ జట్టు భారీ స్కోరు ఆశలకు చివర్లో కల్లెం పడింది. 

ఐపీఎల్ సీజన్ ముగింపు మ్యాచ్ లో ఢిల్లీ బాయ్స్ తడబడ్డారు. ఓపెనర్ల శుభారంభమిచ్చినా తర్వాత బ్యాట్స్మెన్ విఫలమవడంతో నిర్ణీత 20 ఓవర్లలో Delhi capitals నాలుగు వికెట్లు కోల్పోయి బెంగళూరు ఎదుట 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మరి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న Royal Challengers Banglore ఈ టార్గెట్ ను ఛేదిస్తుందా.. లేక మొన్నటి మ్యాచ్ లోలాగే చతికిలపడుతుందా చూడాలి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

టాస్ గెలిచిన Virat Kohli.. ఢిల్లీని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఢిల్లీ ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఫామ్ లేమితో తంటాలు పడుతున్న షా.. 31 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 48 పరుగులతో మెరిశాడు. మరో ఎండ్ లో ఈ సీజన్ లో ఢిల్లీ రన్ మిషన్.. శిఖర్ ధావన్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు సాధించాడు. ఓపెనర్లు రాణించడంతో ఆరో ఓవర్లోనే స్కోరు 55 పరుగులకు చేరింది. 

ఇదే క్రమంలో పది ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోకుండా 85 పరుగులు చేసిన ఢిల్లీ.. వరుస ఓవర్లలో ఓపెనర్లిద్దరనీ కోల్పోయింది. పదో ఓవర్ తొలి బంతిని షా ను చాహల్ ఔట్ చేయగా.. తర్వాత ఓవర్లో హర్షల్ పటేల్ వేసిన బంతిని క్రిస్టియన్ కు క్యాచ్ ఇచ్చి ధావన్ వెనుదిరిగాడు.

ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ Rishabh pant (10) కూడా త్వరగానే నిష్క్రమించాడు. ఈ సమయంలో శ్రేయస్ అయ్యర్ (18), హెట్మెయర్ (22 బంతుల్లో రెండేసి ఫోర్లు, సిక్సర్లతో 29) ఆచితూచి ఆడారు. ఫలితంగా స్కోరు వేగం కాస్త నెమ్మదించింది. 

చివర్లో స్కోరును పెంచే యత్నంలో shreyas.. సిరాజ్ బౌలింగ్ లో క్రిస్టియన్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ను కూడా బెంగళూరు బౌలర్లు కట్టడి చేయడంతో స్కోరు వేగం భాగా తగ్గింది. ఓపెనర్ల విజృంభణతో భారీ స్కోరు తప్పదనుకున్న మ్యాచ్ లో ఢిల్లీ అనూహ్యంగా 164 పరుగులకే పరిమితమైంది. తొలి పది ఓవర్లలో 95 పరుగులు చేసిన ఢిల్లీ కుర్రాళ్లు.. తర్వాత అర్థభాగంలో ఆ ఊపును కొనసాగించలేకపోయారు. 

బెంగళూరు బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టగా.. చాహల్, పటేల్, గార్టన్ తలో వికెట్ తీసుకున్నారు.