Ashwin-Morgan: భారత ప్లేయర్లపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ఆసీస్ మీడియా.. దిమ్మతిరిగే సమాధానమిచ్చిన అశ్విన్
Ashwin-Morgan spat: టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మధ్య జరిగిన ‘ఎక్స్ ట్రా రన్’ వివాదం ఖండాంతరాలు దాటింది. దీనిపై ఆస్ట్రేలియా మీడియా అతిగా స్పందించింది.
స్లెడ్జింగ్ కు మారుపేరైన ఆసీస్ ఆటగాళ్లు ఇతర దేశాల క్రికెటర్లను ఎన్ని మాటలన్నా కన్నెత్తి చూడని ఆసీస్ మీడియా భారత ప్లేయర్లపై మాత్రం వివక్ష ప్రదర్శిస్తున్నది. నాటి హర్భజన్ సింగ్-ఆండ్రూ సైమండ్స్ వివాదం నుంచి ఇప్పటిదాకా ఆ దేశ మీడియాది వివక్షాపూరిత వైఖరే. తాజాగా ఆసీస్ మీడియా కన్ను ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మీద పడింది.
రెండ్రోజుల క్రితం కోల్కతాతో మ్యాచ్ సందర్భంగా జరిగిన ఎక్స్ ట్రా రన్ వివాదం దీనికి కారణమైంది. అశ్విన్ ను మోసకారిగా అభివర్ణించింది. మోర్గాన్ తప్పేమీ లేదని, క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించింది అశ్వినేనని నిందించింది. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ కూడా దీనిని ‘అవమానకర ఘటన. ఇలాంటిది మళ్లీ జరుగకూడదు’ అంటూ ట్వీట్ చేశాడు.
వీటన్నింటికి అశ్విన్ వరుస ట్వీట్లతో ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అతడు స్పందిస్తూ... ‘రాహుల్ త్రిపాఠి విసిరిన బంతి రిషబ్ కు తగిలిన విషయం తనకు తెలియదు. అలా తెలిసుంటే పరుగు తీసేవాడినే కాదు’ అని పేర్కొన్నాడు.
మోర్గాన్ తో గొడవపడ్డ విషయం గురించి.. ‘లేదు. నేనలా చేయలేదు. నేను అక్కడ నిల్చున్నాను. నా తల్లిదండ్రులు, గురువులు నాకు సంస్కారం నేర్పారు. మోర్గాన్ గానీ సౌథీ గానీ వారి క్రీడా ప్రపంచంలో దానిని తప్పంటారో లేదా ఒప్పంటారో అనుకోనీయండి. నేను మాత్రం గొడవ పడలేదు’ అని తెలిపాడు. అన్నింటికంటే దీని గురించి మీడియాలో చర్చలు పెట్టడం తనను తీవ్రంగా బాధించిందని అశ్విన్ రాసుకొచ్చాడు.