ఐపిఎల్ 2020: హైదరాబాద్ మీద ఓటమిపై విరాట్ కోహ్లీ స్పందన ఇదీ...
సన్ రైజర్స్ హైదరాాబాద్ మీద ఐదు వికెట్ల తేడాతో తమ జట్టు ఓటమి పాలు కావడంపై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. తాము తెగువ చూపలేకపోయామని కోహ్లీ అన్నాడు.
షార్జా: సన్ రైజర్స్ హైదరాబాద్ మీద ఐదు వికెట్ల తేడాతో తాము పరాజయం కావడంపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. బ్యాటింగ్ చేసే విషయంలో తమ ఆటగాళ్లు సాహసం ప్రదర్శించలేకపోయారని ఆయన అన్నాడు. బెంగళూరు ఏడు వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 120 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆర్సీబీ నిర్దేశించిన 121 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాదు అత్యంత సులభంగా ఛేదించింది. కేవలం 14.1 ఓవర్లలో హైదరాబాదు ఆర్సీబీపై విజయం సాధించింది. ఆర్సీబీ బ్యాట్స్ మెన్ లో జోష్ ఫిలిప్ 31 బంతుల్లో 32 పరుగుుల చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీతో పాటు మిగతా బ్యాట్స్ మెన్ ఎవరు కూడా తెగువ ప్రదర్శించలేకపోయారు.
తాము చేసిన 120 పరుగులు ఏ మాత్రం సరిపోవని, ఈ మైదానంలో కనీసం 140 పరుగులైనా చేయాల్సి ఉండిందని విరాట్ కోహ్లీ అన్నాడు. తాము బ్యాటింగ్ లో తెగువ చూపలేకపోయామని, క్రెడిట్ హైదరాబాద్ జట్టుకు దక్కుతుందని, వాళ్లు పిచ్ ను బాగా వాడుకున్నారని, పేస్ లో వైవిధ్యాన్ని కనబరిచారని అన్నాడు.
మంచు కారణంగా కూడా తాము పరిస్థితిని అంచనా వేయడంలో విఫలమయ్యామని చెప్పాడు. సెకండ్ ఇన్నంగ్స్ లో పరిస్థితి దారుణంగా మారిందని అన్నాడు. బంతిని పట్టుకోవడం కూడా కష్టమైందని అన్నాడు.