IPL 2020 Final: ఐదోసారి ఛాంపియన్గా ముంబై ఇండియన్స్... యువ ఢిల్లీకి నిరాశే...
రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్... ‘హిట్ మ్యాన్’ ఖాతాలో ఐదో ఐపీఎల్ టైటిల్...
ముంబై ఇండియన్స్ ముందు తేలిపోయిన ఢిల్లీ బౌలర్లు...
ఢిల్లీ క్యాపిటల్స్పై సీజన్లో నాలుగో విక్టరీ నమోదుచేసిన ముంబై ఇండియన్స్...
చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత వరుస సీజన్లతో టైటిల్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్...
IPL 2020: డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మరోసారి టైటిల్ విజేతగా నిలిచింది. టాప్ క్లాస్ పర్ఫామెన్స్తో వరుసగా రెండో సీజన్లోనూ ఫైనల్ చేరిన ముంబై, 2020లో ఢిల్లీని నాలుగో మ్యాచ్లోనూ చిత్తుగా ఓడించి... రికార్డు స్థాయిలో ఐదో టైటిల్ సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత వరుస సీజన్లలో టైటిల్స్ గెలిచిన రెండో జట్టుగా నిలిచింది ముంబై ఇండియన్స్.
గాయం తర్వాత ఆడిన మొదటి మ్యాచ్లో 4, రెండో మ్యాచ్లో డకౌట్ అయిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 157 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్... మొదటి ఓవర్ నుంచి ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. వరుస బౌండరీలు బాదుతూ ఢిల్లీ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం లేకుండా చేశారు ముంబై బ్యాట్స్మెన్.
డి కాక్ 20 పరుగులు చేసి అవుట్ కాగా సూర్యకుమార్ యాదవ్ 19 పరుగులకి రనౌట్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి అవుట్ కాగా.. ఇషాన్ కిషన్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్లతో 33 పరుగులు చేసి లాంఛనాన్ని ముగించారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలవగా, ఢిల్లీ బౌలర్ రబాడా అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలిచాడు.