India vs South Africa: రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకి ఆలౌట్ అయిన సౌతాఫ్రికా... 113 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం...

INDvsSA 1st Test: సెంచూరియన్ టెస్టులో భారత జట్టు చరిత్ర సృష్టించింది. సౌతాఫ్రికాని రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకి ఆలౌట్ చేసి 113 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది. సెంచూరియన్‌లో సౌతాఫ్రికా జట్టును ఓడించిన మొట్టమొదటి ఆసియా జట్టుగా నిలిచింది టీమిండియా...

ఐదో రోజు లంచ్ బ్రేక్ విరామానికి 66 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసిన సౌతాఫ్రికా, ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 94/4 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు, విజయమే లక్ష్యంగా ఫస్ట్ సెషన్ ఫస్టాఫ్‌లో బ్యాటింగ్ కొనసాగించింది. సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గర్, భువుమా కలిసి ఐదో వికెట్‌కి 36 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న డీన్ ఎల్గర్‌ను జస్ప్రిత్ బుమ్రా పెవిలియన్‌కి పంపాడు...

156 బంతుల్లో 12 ఫోర్లతో 77 పరుగులు చేసిన డీన్ ఎల్గర్, బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్వింటన్ డి కాక్, భువుమా కలిసి ఆరో వికెట్‌కి 31 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

28 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్‌ను మహ్మద్ సిరాజ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 161 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. ఆ తర్వాత 3 బంతుల్లో 1 పరుగులు చేసిన వీన్ ముల్దార్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

ఆ తర్వాత మార్కో జాన్సెన్ 14 బంతుల్లో మూడు ఫోర్లతో 13 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, రబాడా అశ్విన్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే లుంగి ఎంగిడిని అవుట్ చేసిన అశ్విన్, భారత జట్టుకి విజయాన్ని అందించాడు. తెంబ భువుమా 80 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు

సెంచూరియన్‌లో ఐదో రోజు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియచేసింది. అయితే మొదటి సెషన్‌లో మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా ఆట సాగింది.

అంతకుముందు నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 305 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీ జట్టుకి రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న అయిడిన్ మార్క్‌రమ్‌ను మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఒక్క పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా. ఆ తర్వాత కీగన్ పీటర్సన్, డీన్ ఎల్గర్ కలిసి రెండో వికెట్‌కి 33 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

36 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన కీగన్ పీటర్సన్‌ను మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత రస్సీ వాన్ దేర్ దుస్సేన్, ఎల్గర్ కలిసి మూడో వికెట్‌కి 40 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని బుమ్రా విడదీశాడు...

65 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసిన రస్సీ వాన్ దేర్ దుస్సేన్, బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కేశవ్ మహరాజ్, డీన్ ఎల్గర్ కలిసి నాలుగో వికెట్‌కి 20 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన కేశవ్ మహరాజ్‌ కూడా బుమ్రా బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు...