రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా... సౌతాఫ్రికా ముందు 305 పరుగుల భారీ లక్ష్యం...

సెంచూరియన్ టెస్టులో ఓవర్‌నైట్ స్కోరు 16/1 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా ముందు 305 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. మార్కో జాన్సెన్, కగిసో రబాడా నాలుగేసి వికెట్లతో విజృంభించడంతో లంచ్ బ్రేక్ విరామం తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది టీమిండియా. 


తొలి సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన శార్దూల్ ఠాకూర్ 26 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 10 పరుుగుల చేసి రబాడా బౌలింగ్‌లో ముల్దర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి ఆకట్టుకున్న ఓపెనర్ కెఎల్ రాహుల్ 74 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేసి లుంగి ఎంగిడి బౌలింగ్‌లో డీన్ ఎల్గర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

54 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన భారత జట్టు, 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసి లంచ్ బ్రేక్‌కి వెళ్లింది. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఆరంభం నుంచే తనదైన స్టైలో దూకుడుగా ఆడాడు. బౌండరీతో ఖాతా తెరిచిన విరాట్ కోహ్లీ 32 బంతుల్లో 4 ఫోర్లతో 18 పరుగులు చేశాడు...

లంచ్ బ్రేక్ తర్వాత మొదటి బంతికే కీపర్ క్వింటన్ డి కాక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. మార్కో జాన్సన్ బౌలింగ్‌లో మరోసారి అవుట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని వెంటాడి, వికెట్ పారేసుకున్నాడు విరాట్...

గత ఏడాది సెంచరీ లేకుండానే ముగించిన విరాట్ కోహ్లీ, ఈ ఏడాదిని కూడా సెంచరీ మార్కు లేకుండానే ముగించినట్టైంది. 2009 తర్వాత వరుసగా 11 ఏళ్ల పాటు ప్రతీ ఏటా ఏదో ఓ ఫార్మాట్‌లో సెంచరీ చేస్తూ వచ్చిన విరాట్ కోహ్లీ, గత రెండేళ్లుగా ఆ మార్కును అందుకోలేకపోయాడు...

ఆ తర్వాత ఛతేశ్వర్ పూజారా 16, రహానే 20, రిషబ్ పంత్ 34, రవిచంద్రన్ అశ్విన్ 14, మహ్మద్ షమీ 1 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. 64 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారాను మార్కో జాన్సెన్ అవుట్ చేయగా, 23 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన అజింకా రహానే కూడా అతని బౌలింగ్‌లోనే భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు...

111 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది టీమిండియా. ఈ దశలో రిషబ్ పంత్ దూకుడుగా బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేశాడు. 17 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన అశ్విన్, 34 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు చేసిన రిషబ్ పంత్ కూడా రబాడా బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరారు...

ఆ తర్వాత మహ్మద్ షమీ 12 బంతుల్లో 1 పరుగు చేసి రబాడా బౌలింగ్‌లో అవుట్ కాగా, సిరాజ్‌ను మార్కో జాన్సెన్ డకౌట్ చేశాడు. 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన జస్ప్రిత్ బుమ్రా నాటౌట్‌గా నిలిచాడు.