శుభమన్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు.. కోహ్లీ రికార్డు బ్రేక్
INDvsNZ Live: శ్రీలంకతో మూడో వన్డేలో సెంచరీ బాదిన గిల్.. తాజాగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో మరో శతకం బాదాడు. రోహిత్, కోహ్లీ, ఇషాన్ లు విఫలమైన చోట గిల్ కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నాడు.

‘గత ఏడాదికాలంగా శుభమన్ గిల్ వన్డేలలో నిలకడగా రాణిస్తున్నాడు. అటువంటి ఆటగాడికి అండగా నిలవడం చాలా కీలకం. అతడికి వరుసగా అవకాశాలిస్తాం..’ శ్రీలంకతో వన్డే సిరీస్ కు ముందు టీమిండియా సారథి రోహిత్ శర్మ అన్న మాటలివి. తనపై టీమ్ మేనేజ్మెంట్ ఉంచిన నమ్మకాన్ని గిల్ వమ్ము చేయడం లేదు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. లంకతో తొలి వన్డేలో రోహిత్ తో కలిసి హండ్రెడ్ ప్లస్ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ పంజాబ్ కుర్రాడు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అదరగొడుతున్నాడు.
శ్రీలంకతో మూడో వన్డేలో సెంచరీ బాదిన గిల్.. తాజాగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో మరో శతకం బాదాడు. రోహిత్, కోహ్లీ, ఇషాన్ లు విఫలమైన చోట గిల్ కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుని తన వన్డే కెరీర్ లో మూడో సెంచరీ సాధించాడు.
ఈ మ్యాచ్ లో తొలి నుంచి దూకుడుగా ఆడిన గిల్.. 52 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అర్థ శతకం తర్వాత మరింత రెచ్చిపోయిన గిల్.. ఫోర్లతో కివీస్ బౌలర్లపై రెచ్చిపోయాడు. తొలుత రోహిత్ తో 60 పరుగులు జోడించిన గిల్.. తర్వాత సూర్యకుమార్ యాదవ్ తో కూడా ఫిఫ్టీ పార్ట్నర్షిప్ పూర్తి చేశాడు.
మిచెల్ సాంట్నర్ వేసిన ఇన్నింగ్స్ 28వ ఓవర్లో బౌండరీ బాది 90లలోకి చేరిన గిల్.. అతడే వేసిన 30వ ఓవర్లో భారీ సిక్సర్ బాది 99కు చేరాడు. తర్వాత బంతికి లాంగాన్ దిశగా సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
రికార్డులు..
- ఈ శతకం ద్వారా గిల్ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేలలో భారత్ తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్ (19) లలో వెయ్యి పరుగులు సాధించిన బ్యాటర్ గా గిల్ రికార్డులకెక్కాడు. గతంలో ధావన్, కోహ్లీలకు ఈ ఫీట్ సాధించడానికి 24 ఇన్నింగ్స్ అవసరం పడ్డాయి.
- ఆడిన 19వ ఇన్నింగ్స్ లలో మూడు సెంచరీలు బాదిన రెండో భారత బ్యాటర్ గిల్. గిల్ కంటే ముందు ధావన్ పేరిట ఈ రికార్డు ఉంది.
ఈ మ్యాచ్ కు ముందు 18 ఇన్నింగ్స్ లలో 894 పరుగులు చేసిన గిల్.. నేటి వన్డేలో 106 పరుగులు చేయడంతో వన్డేలలో అతడి వెయ్యి పరుగులు పూర్తయ్యాయి.
ఇక హైదరాబాద్ వన్డేలో గిల్ సెంచరీ చేయడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. 33 ఓవర్లు ముగిసేసరికి భారత్.. నాలుగు వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (34) కుదురుకున్నట్టే కనిపించినా భారీ షాట్ ఆడి ఔటయ్యాడు. మళ్లీ మునపటి ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ.. 8 పరుగులే చేశాడు. ఇషాన్ కిషన్ 5 పరుగులకే నిష్క్రమించగా.. సూర్యకుమార్ యాదవ్ (31) కూడా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం శుభమన్ గిల్ (110 బ్యాటింగ్) తో పాటు హార్ధిక్ పాండ్యా (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.