INDvsENG 4th Test: తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్... మ్యాజిక్ చేసిన శార్దూల్ ఠాకూర్...
100 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్... 50 పరుగులు చేసిన రోరీ బర్న్స్ను అవుట్ చేసిన శార్దూల్ ఠాకూర్...
నాలుగో టెస్టు నాలుగో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. తొలి వికెట్కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత ఓపెనర్ రోరీ బర్న్స్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 125 బంతుల్లో 5 ఫోర్లతో 50 పరుగులు చేసిన రోరీ బర్న్స్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో కీపర్ రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
శార్దూల్ ఠాకూర్కి రెండో ఇన్నింగ్స్లో ఇదే తొలి ఓవర్ కావడం విశేషం. రోరీ బర్న్స్ అవుటైన తర్వాత మరో ఓపెనర్ హసీబ్ హమీద్ కూడా హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 123 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు అందుకున్నాడు హమీద్. ఇంకా టీమిండియా విధించిన లక్ష్యానికి 260+ పరుగుల దూరంలో ఉంది ఇంగ్లాండ్ జట్టు...
పిచ్ బౌలర్లకు ఏ మాత్రం సహకరించకపోవడంతో మ్యాచ్ రిజల్ట్ రావడం అనుమానంగానే మారింది. ఇంగ్లాండ్ జట్టు దూకుడుగా ఆడితే, మూడు సెషన్లలో ఈ లక్ష్యాన్ని ఛేధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
టీమిండియా విజయాన్ని అందుకోవాలంటే మరో 9 వికెట్లు తీయాల్సి ఉంటుంది. అయితే మ్యాచ్ విన్నర్, ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేకుండా బరిలో దిగిన భారత జట్టు, ఆ పొరపాటుకి భారీ మూల్యం చెల్లించుకునేలా కనిపిస్తోందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...