INDvsAUS Tests: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్  బోర్డర్ - గవాస్కర్  ట్రోఫీ (బీజీటీ) ఆడేది అనుమానంగానే ఉన్నది.   ప్రస్తుతం అతడు ఎన్సీఏలో ఉన్నాడు. 

గత నెలలో వెన్ను నొప్పి గాయంతో జట్టుకు దూరమై ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో శిక్షణ పొందుతున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగమవడం అనుమానంగానే ఉంది. ఈ సిరీస్ కు అతడు ఎంపికైనా గాయం కారణంగా తొలి టెస్టులో ఆడలేదు. తాజా రిపోర్టుల ప్రకారం.. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో ఢిల్లీ లో మొదలుకాబోయే రెండో టెస్టులో కూడా అతడు ఆడేది అనుమానమే.

వెన్ను నొప్పి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అయ్యర్.. ఫిట్నెస్ నిరూపించుకోవడానికి దేశవాళీలో ఆడాలని బీసీసీఐ కోరుతున్నది. దేశవాళీలో ఫిట్నెస్ నిరూపించుకున్న తర్వాతే అతడు జాతీయ జట్టులో ఆడేందుకు అనుమతినిస్తారు. 

వచ్చే నెల మొదటి నుంచి ఇరానీ కప్ లో భాగంగా మధ్యప్రదేశ్ తో రెస్టాఫ్ ఇండియా టీమ్ తలపడనుంది. మార్చి 1 నుంచి 5 వరకు ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఎవరైనా ఆటగాడు గాయపడితే తిరిగి అతడు కోలుకున్నాక ఫిట్నెస్ ను నిరూపించుకోవడానికి సదరు ప్లేయర్ దేశవాళీలో ఆడాలని బీసీసీఐ ఇటీవలే ఆదేశించిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగానే ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జడ్డూ.. ఆసీస్ తో టెస్టు కంటే ముందే బరోడా తరఫున తమిళనాడుతో రంజీ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే సూత్రాన్ని అయ్యర్ కు అప్లై చేస్తున్నారు.

Scroll to load tweet…

ఒకవేళ ఇదే జరిగితే మాత్రం బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో అయ్యర్ ఆడేది అనుమానమే. ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీలో భారత్ - ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు జరుగుతుంది. మార్చి 1 నుంచి మూడో టెస్టు ఇండోర్ లో జరుగుతుంది. ఇరానీ కప్ కూడా మార్చి 1 నుంచే మొదలుకానుంది. ఈ నేపథ్యంలో అయ్యర్ ఒక్క మ్యాచ్ ఆడి వచ్చినా అప్పటికీ సిరీస్ ముగింపు దశకు చేరుతుంది. మిగిలిన ఒక్క మ్యాచ్ లో అయినా అయ్యర్ ను ఆడిస్తారా..? లేదా..? అన్నదీ డౌటే. 

కాగా ఎన్సీఏలో ఉన్న అయ్యర్.. ట్రైనర్ ఎస్ రజినీకాంత్ శిక్షణలో రిహాబిటేషన్ ప్రోగ్రామ్స్ కు సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్టు చేశాడు. తాను మ్యాచ్ లు ఆడేందుకు సన్నద్ధంగా ఉన్నానని ఈ వీడియోల ద్వారా అయ్యర్ చెప్పకనే చెప్పాడు. 


Scroll to load tweet…