టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ఇందిరానగర్ గుండా.. వీడియో వైరల్
BGT 2023 Live: భారత్ - ఆస్ట్రేలియాల మధ్య నాగ్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలింగ్ లో అదరగొడుతోంది. తొలి రోజు మూడు సెషన్లు కూడా ముగియకపముందు కంగారూల పనిపట్టింది.
భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాకు టీమిండియా తొలి రోజే చుక్కలు చూపిస్తున్నది. నాగ్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజే ఆసీస్ ను తొలి ఇన్నింగ్స్ లో నిలువరించిన భారత్.. బ్యటింగ్ లో కూడా మెరుగ్గానే ఆడుతోంది. టాస్ గెలిచిన ఆసీస్.. తొలుత బ్యాటింగ్ కు వచ్చీ రాగానే ఆ జట్టుకు షాకులు తాకాయి. తన తొలి ఓవర్లోనే సిరాజ్.. ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాను బలిగొన్నాడు. సిరాజ్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే ఖవాజా.. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకోవడానికి చివరి క్షణం వరకూ వేచి చూసిన రోహిత్.. ఒక్క సెకండ్ మాత్రమే ఉందనగా రివ్యూ కోరాడు.
టీవీ రిప్లేలో బంతి వికెట్లకు తాకుతున్నట్టుగా వచ్చింది. దీంతో భారత జట్టు ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. ఇదే క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా అగ్రెసివ్ అటిట్యూడ్ తో కనిపించాడు. ‘సాధించాం..’ అన్న స్థాయిలో ద్రావిడ్ రియాక్షన్ ఇచ్చాడు. అంపైర్ అవుట్ అని ప్రకటించగానే.. ద్రావిడ్.. పిడికిలి దగ్గరికి బిగించి కోహ్లీ మాదిరిగా సంబురాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
మాములుగా ద్రావిడ్ ను ఇంత అగ్రెసివ్ గా చూడటం చాలా అరుదు. గతంలో ఓసారి శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు, ఐపీఎల్ లో ఒకసారి, గతేడాది టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ పై గెలిచినప్పుడు ద్రావిడ్ తనలోని అగ్రెసివ్ అటిట్యూడ్ ను అణుచుకోలేకపోయాడు. శ్రీలంకతో మ్యాచ్ లో ద్రావిడ్ అసహనాన్ని స్ఫూర్తిగా తీసుకుని క్రెడ్ యాప్.. ఏకంగా అతడి మీద ఓ యాడ్ చేసింది. ఈ యాడ్ లో ద్రావిడ్.. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి బ్యాట్ తో కారు అద్దాలు పగలగొడతాడు. ఈ వీడియోకు క్రెడ్.. ‘ఇందిరానగర్ కా గూండా’అని పేరు పెట్టింది.
తాజాగా నాగ్పూర్ టెస్టులో ద్రావిడ్ వీడియో చూశాక నెటిజనులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఇందిరానగర్ గూండా వచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలాఉండగా నాగ్పూర్ లో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్.. 177 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో లబూషేన్ (49) టాప్ స్కోరర్. స్మిత్ (37), హ్యాండ్స్కాంబ్ (31), అలెక్స్ క్యారీ (36) ఫర్వాలేదనిపించారు. మిగతావాళ్లలో ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేదు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొట్టగా అశ్విన్ 3, షమీ, సిరాజ్ లు తలా ఓ వికెట్ తీశారు. అనంతరం భారత్.. 21 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (44 నాటౌట్), కెఎల్ రాహుల్ (17 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు.