టీమిండియా జెర్సీ మరోసారి మారింది... ఇకపై ఇండియన్ బ్రాండ్
టీమిండియా జెర్సీ మరోసారి మారనుంది. ఇటీవల ప్రపంచ కప్ లో మాదిరిగా పూర్తిగా మారిపోదు. కేవలం భారత ఆటగాళ్ల జెర్సీలపై వుండే బ్రాండ్ నేమ్ ఒక్కటే మారనుంది. చైనా సంస్థకు చెందిన పేరుకు బదులు అచ్చమైన ఇండియన్ సంస్థ పేరు ఇకపై భారత ఆటగాళ్ల జెర్సీలపై దర్శనమివ్వనుంది.
టీమిండియా... ప్రపంచ క్రికెట్లో అత్యంత బ్రాండ్ వాల్యూ కలిగిన జట్టు. ఆ జట్టులో ఒక్క ఆటగాడు తమ బ్రాండ్ కు ప్రచారం చేస్తే సరిపోతుందని పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు బావిస్తుంటాయి. అలాంటిది కోహ్లీ, ధోని, రోహిత్ వంటి హేమాహేమీలతో కూడిన టీమిండియా మొత్తం కలిని ఒక బ్రాండ్ కు ప్రచారం కల్పిస్తే ఎలా వుంటుంది. అలాంటి అరుదైన అవకాశాన్నే ప్రముఖ అన్ లైన్ ట్యూటోరియల్ సంస్థ బైజుస్ కొట్టేసింది.
టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై వెస్టిండిస్ పర్యటన తర్వాత నుండి బైజుస్ బ్రాండ్ దర్శనమివ్వనుంది. ఈ మేరకు బెంగళూరుకు చెందిన ఈ ఆన్ లైన్ ట్యూటోరియల్ సంస్థ బిసిసిఐ తో చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ హక్కులను కలిగివున్న ఒప్పో అర్ధాంతరంగా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని బిసిసిఐని కోరిందట. దీంతో టీమిండియా ద్వారా ప్రచారం చేసుకునే అవకాశాన్ని బైజుస్ కొట్టేసింది. ఈ మేరకు అధికారిక చర్చలు కూడా పూర్తయినట్లు సమాచారం.
2017లో స్టార్ ఇండియాతో ఒప్పందం ముగిసిన తర్వాత చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ బిసిసిఐతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం రూ.1079 కోట్లకు ఐదేళ్లపాటే స్పాన్సర్ షిప్ హక్కులను పొందింది. అయితే 2022 వరకు గడువు వున్నప్పటికి ఒప్పో సంస్థ మధ్యలోని ఒప్పందాన్ని బ్రేక్ చేసింది. దీంతో అంతే మొత్తంలో డబ్బు చెల్లించి తమ బ్రాండ్ ను టీమిండియా చేత ప్రచారం చేయించుకోడాని బైజుస్ సిద్దపడింది.
భారత్ ఆగస్ట్ 3 నుండి సెప్టెంబర్ 2 వరకు వెస్టిండిస్ పర్యటన చేపట్టనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 15 నుండి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనలో బైజుస్ పేరు టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై దర్శనమివ్వనున్నట్లు సమాచారం.