Uganda Cricketer Dinesh Nakrani: భారత పేస్ బౌలర్ దీపక్ చాహర్ అంతర్జాతీయ టీ20లలో నెలకొల్పిన రికార్డును ఉగాండాకు చెందిన ఒక బౌలర్ సమం చేశాడు. అతడు కూడా భారతీయ సంతతికి చెందిన వ్యక్తే కావడం విశేషం. 

అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లలో భారత పేస్ బౌలర్ దీపక్ చాహర్ (Deepak Chahar) నెలకొల్పిన రికార్డును ఉగాండాకు చెందిన ఒక బౌలర్ సమం చేశాడు. ఉగాండా (Uganda)కు చెందిన భారతీయ సంతతి వ్యక్తి దినేశ్ నకర్ణి (Dinesh Nakarni).. ఈ రికార్డు సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

ఉగాండా తరఫున ఆడుతున్న నకర్ణి.. మంగళవారం లెసొతొ (Lesotho- దక్షిణాఫ్రికా ఖండంలోని ఒక చిన్న దేశం) తో జరిగిన టీ20 మ్యాచ్ లో అదరగొట్టే ప్రదర్శన చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 World cup 2021) సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్స్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో నకర్ణి.. 4 ఓవర్లు వేసి ఏడు పరుగులే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు తీసుకున్నాడు. 

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లెసొతొ.. దినేశ్ ధాటికి 26 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో సమిర్ పటేల్ (ఇతడు కూడా భారతీయ సంతతి వ్యక్తే) ఒక్కడే పది పరుగులు చేశాడు. నలుగురు బ్యాట్స్మెన్ డకౌట్ కాగా.. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. 

Scroll to load tweet…

నకర్ణి బౌలింగ్ లో.. జక్డ (5), మాజ్ ఖాన్ (3), సర్ఫరాజ్ పటేల్ (4), ఒమర్ హుస్సేన్ (0), మొలాయ్ (0), అయాజ్ పటేల్ (0) కే వెనుదిరిగారు. నకర్ణి విజృంభణతో లెసొతొ.. 12.4 ఓవర్లలోనే 26 పరుగులకు చాప చుట్టేసింది. వీరిలో ఒక్క మాజ్ ఖాన్ తప్ప మిగిలినవారంతా ఎల్బీడబ్ల్యూ గానో లేకుంటే బౌల్డ్ అయి వెనుదిరిగిన వారే కావడం విశేషం. అనంతరం బ్యాటింగ్ చేసిన ఉగాండా జట్టు.. 3.4 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. 

Also Read: Virat Kohli: కోహ్లి మరో ఘనత..దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఆవిష్కరణ

మీడియం పేసర్ అయిన దినేశ్.. గుజరాత్ (Gujarat) వాస్తవ్యుడు. గతంలో సౌరాష్ట్ర తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు. అయితే ఆ తర్వాత ఉగాండాకు మకాం మార్చి అక్కడ జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. లెసొతొ మ్యాచ్ లో దినేశ్ అద్భుత ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.

కాగా, 2019 లో నవంబర్ 10 న బంగ్లాదేశ్ తో జరిగిన మూడో టీ20 లో దీపక్ చాహర్ కూడా ఈ రేర్ ఫీట్ సాధించాడు. ఆ మ్యాచ్ లో అతడు.. 3.2 ఓవర్లు వేసి ఏడు పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది.