Asia Cup BCCI: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆసియా కప్‌ సహా అన్ని ఏసీసీ ఈవెంట్ల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపింది. దీంతో పాకిస్తాన్ కు మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. 

Asia Cup BCCI: భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న తాజా ఉద్రిక్తతల మ‌ధ్య పాక్ కు భార‌త్ వ‌రుస షాక్ లు ఇస్తూనే ఉంది. భార‌త్ తో పెట్టుకుంటే ఏం జ‌రుగుతుందో చేతల్లో చూపిస్తోంది. తాజాగా క్రికెట్ విష‌యంలో కూడా పాక్ కు షాక్ ఇచ్చింది భార‌త్. ఇప్పటికే ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరంగా ఉన్న భార‌త్.. ఆసియా కప్ కు కూడా దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించింది.

ఈ క్రమంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కి ప్రస్తుత అధ్యక్షుడిగా పాకిస్తాన్ మంత్రి మోహ్సిన్ నక్వీ వ్యవహరించడాన్ని అభ్యంతరంగా భావించిన బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ), ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే ఏసియా కప్‌తో పాటు అన్ని ఏసీసీ ఈవెంట్ల నుంచి తప్పుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 

పాక్ ను ఒంటరిని చేస్తోన్న భారత్ 

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. "ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పాకిస్తాన్ మంత్రిగా ఉన్నందువల్ల, భారత జట్టు అటువంటి పోటీల్లో పాల్గొనలేం. ఇది దేశ ప్రజల భావోద్వేగ అంశం" అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే, జూన్‌లో శ్రీలంకలో జరగనున్న మహిళల ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్‌ నుంచి కూడా భారత్ తప్పుకుంటుందని సమాచారం.

ఆసియా కప్‌కు ప్రధాన ఆదాయం భారత్ నుంచి వచ్చే స్పాన్సర్‌షిప్‌ల ద్వారానే లభిస్తున్నదని రిపోర్టులు పేర్కొంన్నాయి. దీంతో భార‌త్ ఈ టోర్నీకి దూరంగా ఉంటే నిర్వ‌హ‌ణ క‌ష్ట‌మ‌ని బోర్డ్ భావిస్తోంద‌ని కూడా మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి.

ఆసియా కప్ జరిగేనా? 

2024లో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) ఆసియా కప్ మిడియా హక్కులను 170 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. కానీ టోర్నీ జరగకపోతే, ఈ ఒప్పందాన్ని పునర్విచారణ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.

గత ఏడాది జరిగిన ఏసియా కప్ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించారు. పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు కలిగి ఉండగా, భారత్ పాక్ రాన‌ని చెప్ప‌డంతో.. తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది. కోలంబోలో జరిగిన ఫైనల్లో భారత్ శ్రీలంకపై గెలిచి టైటిల్ దక్కించుకుంది. పాక్ జట్టు ఫైనల్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది.

తాజాగా బీసీసీఐ నిర్ణయంతో మోహ్సిన్ నక్వీ నేతృత్వంలోని ఏసీసీ భవిష్యత్తుపై కూడా అనేక ప్రశ్నలు నెలకొన్నాయి. అంతకుముందు, ఐసీసీ అధ్యక్షుడిగా జై షా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన ACC అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

ఏసీసీ 1983లో స్థాపితమై దక్షిణాసియా దేశాల్లో క్రికెట్ అభివృద్ధికి పని చేస్తోంది. ప్రస్తుతం పూర్తి సభ్యులుగా ఉన్న ఐదు దేశాలైన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్ఘనిస్తాన్ లు ప్రసార హక్కుల ఆదాయంలో 15 శాతం చొప్పున పొందుతుండగా, మిగిలిన మొత్తం అసోసియేట్ సభ్యులకు అందుతుంది. భారత్ తప్పుకోవడంతో మిగత దేశాలు కూడా టోర్నీకి దూరంగా ఉండే అవకాశముంది.