ఔర్ ఏక్ దక్క, ఫైనల్ బెర్త్ పక్కా: న్యూజీలాండ్ టెస్టు సిరీస్ తో టెస్టు వరల్డ్ కప్ పై గురిపెట్టిన భారత్
2021 ఐసీసీ టెస్టు చాంపియన్షిప్స్ ఫైనల్స్ బెర్త్పై కన్నేసిన కోహ్లిసేన ఇప్పుడు ఈ టెస్టు సిరీస్ ను దక్కించుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్లో ఆయుధాలను పరీక్షించుకున్న టీమ్ ఇండియా వెల్లింగ్టన్లో వాటిని సమర్థవంతంగా ప్రయోగానికి సిద్ధమవుతోంది.
న్యూజీలాండ్ పర్యటనలో ఉన్న భారతజట్టు రేపటి నుండి టెస్టు సిరీస్ ను ఆడబోతుంది. ఈ న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ భారత్ కు చాలా కీలకమైనది. సాధారణ ఒక సిరీస్ లాగా కాకుండా భారత ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తును ఇది ఎంతో కీలకం.
టి 20 వరల్డ్కప్ ఏడాదిలో టీ20 సిరీస్ను 5-0తో క్వీన్స్వీప్ చేసింది భారత జట్టు. వన్డే సిరీస్ను 0-3తో అవమానకర రీతిలో కోల్పోయినా మిడిల్ ఆర్డర్లో మాత్రం విలువైన ఆటగాళ్లను దొరకబట్టగలిగింది.
2021 ఐసీసీ టెస్టు చాంపియన్షిప్స్ ఫైనల్స్ బెర్త్పై కన్నేసిన కోహ్లిసేన ఇప్పుడు ఈ టెస్టు సిరీస్ ను దక్కించుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్లో ఆయుధాలను పరీక్షించుకున్న టీమ్ ఇండియా వెల్లింగ్టన్లో వాటిని సమర్థవంతంగా ప్రయోగానికి సిద్ధమవుతోంది.
టెస్టుల్లో అజేయ భారత్...
మూడు సిరీస్లు, అన్నిటిలో కలిపి ఏడు టెస్టులు. అన్నింటిని కూడా టీం ఇండియా విజయవంతంగా నెగ్గింది. ఇప్పటివరకు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ప్రారంభమయినప్పటి నుండి భారత్ టెస్టు మ్యాచ్ ఓడిన దాఖలాలు లేవు.
వెస్టిండీస్పై 2-0, దక్షిణాఫ్రికాపై 3-0తో, బంగ్లాదేశ్పై 2-0తో సిరీస్ లను విజయాలు. సిరీస్కు 120 పాయింట్లు చొప్పున టీమ్ ఇండియా ఖాతాలో 3ఇప్పటికే 60 పాయింట్లు ఉన్నాయి.
Also read: బుమ్రాకు ఇక ఈజీ కాదు: కివీస్ బ్యాట్స్ మెన్ నేర్పిన పాఠం ఇదే...
ఐసీసీ టెస్టు ప్రపంచ చాంపియన్షిప్స్ పట్టికలో అగ్రస్థానంలో భారత్ కొనసాగుతుంది. 2021 లార్డ్స్ ఫైనల్స్కు అర్హత సాధించేందుకు భారత్కు టెక్నికల్గా మరో 100 పాయింట్లు మాత్రమే అవసరం.
ఈ సీజన్లో న్యూజిలాండ్తో 2 టెస్టుల సిరీస్, ఆస్ట్రేలియాలో నాలుగు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ ఆరు మ్యాచుల్లో భారత్కు 100 పాయింట్లు వస్తే చాలు, చారిత్రక లార్డ్స్ ఫైనల్స్కు అర్హత సాధించనుంది.
ఈ నేపథ్యంలో కోహ్లిసేన న్యూజిలాండ్తో టెస్టు సవాల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2014లో భారత్ ఇక్కడ రెండు టెస్టుల సిరీస్ను 0-1తో కోల్పోయింది. 2020లో టెస్టు సిరీస్ను సొంతం చేసుకుని, నవ చరిత్ర సృష్టించాలని భారత్ ఉబలాటపడుతోంది.
దుర్బేధ్యంగా టీం ఇండియా...
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్లో ఓటమెరుగని జట్టు భారత్. ఆడిన మూడు సిరీస్ల్లో కనీసం ఓ మ్యాచ్ను డ్రాగా ముగించని రికార్డు కోహ్లిసేనది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్లు భారత్కు గట్టి పోటీ ఇవ్వలేకపోయాయి. సూపర్ పవర్ జట్టు ముందు మోకరిల్లాయి.
కానీ న్యూజిలాండ్ కథ వేరుగా ఉండనుంది. సొంతగడ్డపై న్యూజిలాండ్ బలమైన జట్టు. ఇదే సమయంలో టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ లేడు. అయినా, టెస్టు సిరీస్కు భారత్ పూర్తి స్థాయి బృందంతో బరిలోకి దిగుతోంది.
టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ ఫామ్లో ఉన్నాయి. మయాంక్ అగర్వాల్ ప్రాక్టీస్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. వరుస వైఫల్యాలకు చెక్ పెడుతూ ప్రాక్టీస్లో అజేయంగా 81 పరుగులు చేశాడు. పృథ్వీ షా సూపర్ ఫామ్లోనే ఉన్నాడు.
శుభ్మన్ గిల్ వార్మప్లో విఫలమైనా, అతడి మ్యాచ్ విన్నింగ్స్ సామర్థ్యంపై ఎటువంటి అనుమానం అవసరం లేదు. కెప్టెన్ విరాట్ కోహ్లి వార్మప్ మ్యాచ్లో ఆడలేదు. అయినా, న్యూజిలాండ్లో చివరగా ఆడిన టెస్టులో కోహ్లి అజేయ శతకం సాధించాడు. ఆ ఫామ్ను కోహ్లి ఇప్పుడూ కొనసాగిస్తాడనటంలో సందేహం లేదు.
పుజరా, అజింక్య రహానేలు మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేస్తున్నారు. హనుమ విహారి వార్మప్ మ్యాచ్ శతకంతో జోరుమీదున్నాడు. లోయర్ ఆర్డర్లో రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహాలు సైతం వార్మప్లో మెరిశారు. దీంతో బ్యాటింగ్ లైనప్లో భారత్కు ఎటువంటి ఇబ్బందులు లేవు.
వన్డే సిరీస్ ఫలితం తర్వాత... బౌలింగ్ విభాగం సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తాయి. కానీ టెస్టుల్లో మాది భిన్నమైన బృందమని బౌలర్లు చాటారు. వార్మప్ మ్యాచ్లో బౌలర్లు సత్తా చాటారు.
70 ఓవర్లలోనే పది వికెట్లు కూల్చి ఔరా అనిపించారు. బుమ్రా, షమి, ఉమేశ్, సైనిలు కూడా రాణించారు. సీనియర్ సీమర్ ఇషాంత్ శర్మ సైతం జట్టుతో చేరాడు. నెట్స్లో శర్మ పూర్తి స్థాయిలో బంతులేశాడు. తొలి టెస్టులో ఇషాంత్ ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సైతం వార్మప్లో ఆకట్టుకున్నారు.
హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ లో న్యూజీలాండ్....
న్యూజిలాండ్ శిబిరంలో కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, జిమ్మీ నీషమ్, గ్రాండ్హౌమ్, బ్రాడ్ వాట్లింగ్ ప్రధాన ఆటగాళ్లు. ట్రెంట్ బౌల్ట్ సారథ్యంలోని పేసర్లు అత్యంత ప్రమాదకారులుగా వెల్లింగ్టన్ లో పరిణమించనున్నారు.
Also read; న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్.... భారత్ కు వెల్లింగ్టన్ పిచ్ విసిరే సవాల్ ఇదే!
న్యూజిలాండ్ టీం కి ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ రూపంలో ఒక బలమైన స్ట్రాటెజిస్ట్ ఉన్నాడు. పిచ్ను అర్థం చేసుకోవటంలో ఎం.ఎస్ ధోని తోని పోల్చదగ్గ దిగ్గజం విలియమ్సన్. ఈ నేపథ్యంలో... టెస్టు సిరీస్ను ఫేవరెట్గా టీం ఇండియా సబరిలోకి దిగబోతున్నప్పటికీ.... న్యూజిలాండ్ కూడా హాట్ ఫేవరెట్గానే బరిలోకి దిగుతోన్న విషయాన్ని కెప్టెన్ కోహ్లి మరిచిపోకూడదు!.