India Vs New Zealand T20I: న్యూజిలాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ అనంతరం దీపక్ చాహర్.. రోహిత్ శర్మతో కలిసి దిగిన ఓ ఫోటోను సామాజిక మాధ్యమాలలో పంచుకున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

టీమిండియా-న్యూజిలాండ్ (India Vs New Zealand) మధ్య జరిగిన తొలి టీ20లో భారత కుర్రాళ్లు అదిరిపోయే ప్రదర్శన చేశారు. విరాట్ కోహ్లి (Virat Kohli) నుంచి టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ (Rohit sharma).. పూర్తిస్థాయి కెప్టెన్ గా తొలి మ్యాచ్ లోనే థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో ఐపీఎల్ (IPL) లో అదరగొట్టిన దీపక్ చాహర్ (Deepak Chahar) కూడా ఆడాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్సులో ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (martin guptill) ను అతడు పెవిలియన్ కు పంపాడు. కాగా మ్యాచ్ అనంతరం దీపక్ చాహర్.. రోహిత్ శర్మతో కలిసి దిగిన ఓ ఫోటోను సామాజిక మాధ్యమాలలో పంచుకున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

జైపూర్.. దీపక్ చాహర్ కు హోమ్ గ్రౌండ్ వంటిది. ఆగ్రాకు చెందిన చాహర్.. దేశవాళీ క్రికెట్ లో రాజస్థాన్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. కాగా, జైపూర్ లో చాహర్ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఈ నేపథ్యంలో ఇన్స్టా (Deepak chahar Instagram) వేదికగా చాహర్ ఓ ఆసక్తికర ఓ పోస్టు చేశాడు. అందులో సారథి రోహిత్ శర్మతో తాను కలిసి ఉన్న రెండు ఫోటోలను జతపరిచాడు. పదిహేనేళ్ల క్రితం దిగిన ఈ ఫోటో గురించి ఇలా రాసుకొచ్చాడు. 

‘ఇదే గ్రౌండ్ లో సుమారు పదిహేనేళ్ల క్రితం తీసుకున్న చిత్రం.. ఆ టైంలో నాకూ, రోహిత్ భయ్యాకు గడ్డం లేదు...’ అని ఫన్నీ క్యాప్షన్ పెట్టాడు చాహర్. అప్పటి ఫోటోతో పాటు నిన్నటి మ్యాచ్ లో ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను ఉంచాడు. తాజా ఫోటోలో ఇద్దరు నిండైన గడ్డంతో మెరిసిపోతున్నారు.

View post on Instagram

దీనికి పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అద్భుతమైన ప్రయాణం చాహర్ భాయ్.. కీపిట్ అప్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదీ చదవండి : Ind Vs NZ: కంటి చూపుతో చంపేస్తా..! న్యూజిలాండ్ ఓపెనర్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన దీపక్ చాహర్

కాగా.. ఈ మ్యాచ్ లో విజయంతో తాము ఎంతో సంతోషంగా ఉన్నామన్న సారథి రోహిత్ శర్మ, ఇటువంటి మ్యాచుల ద్వారా కుర్రాళ్లు నేర్చుకోవడానికి గొప్ప అవకాశం లభిస్తుందని తెలిపాడు. ఛేజింగ్ చేయాల్సి వచ్చినప్పుడు పరిస్థితులకు తగ్గట్టు ఎలా ఆడాలో ఈ మ్యాచ్ ద్వారా యువ క్రికెటర్లు నేర్చుకుని ఉంటారని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో విజయం అంత తేలికగా ఏమీ రాలేదని, ఆఖరుదాకా వేచి చూడాల్సి వచ్చిందని అన్నాడు. బంతిని ఎటు పడితే అటు బాదడం కాదని, గ్యాప్ లు చూసి ఫీల్డర్ల మధ్య నుంచి పంపించడం నేర్చుకోవాలని కుర్రాళ్లకు హితబోధ చేశాడు. సిక్సర్ల కంటే ఫీల్డర్ల మధ్య నుంచి సింగిల్స్, డబుల్స్ తీస్తూ బంతిని బౌండరీకి తరలించడంలోనే అసలైన క్రికెట్ మజా వస్తుందని రోహిత్ అభిప్రాయపడ్డాడు.