Ind Vs Nz: టాస్ గెలిచిన రోహిత్.. హర్షల్ పటేల్ అరంగ్రేటం.. కివీస్ లో మూడు మార్పులు
India Vs New Zealand: టీమిండియా-న్యూజిలాండ్ మధ్య రాంచీలో జరుగుతున్న రెండో టీ20లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియా తరఫున హర్షల్ పటేల్ అరంగ్రేటం చేశాడు.
టీమిండియా కొత్త సారథి రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు.. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టీ20 లో టాస్ గెలిచింది. జార్ఖండ్ రాజధాని రాంచీ వేదికగా జరుగుతున్న ఈ కీలక పోరులో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే జైపూర్ లో ఉత్కంఠభరితంగా ముగిసిన తొలి టీ20 లో భారత జట్టు విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యచ్ లో కూడా గెలిచి సిరీస్ ఒడిసిపట్టాలని రోహిత్ సేన భావిస్తున్నది.
ఈ మ్యాచ్ లో గెలిస్తే.. టీమిండియా టీ20 కొత్త సారథి రోహిత్ శర్మ, కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ కు తొలి సిరీస్ విజయం దక్కనుంది. మరి రాంచీ పోరులోనే రోహిత్ సేన సిరీస్ ను చేజిక్కించుకుంటుందా..? లేక కోల్కతా (మూడో టీ20 వేదిక) కు వాయిదా వేస్తుందా తెలియాలంటే కొద్దిసేపు ఆగాల్సిందే.
ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఒక మార్పు చేసింది. తొలి టీ20 లో గాయపడిన మహ్మద్ సిరాజ్ స్థానంలో ఐపీఎల్ లో అదరగొట్టిన హర్షల్ పటేల్ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. తొలి మ్యాచ్ లో విఫలమైన అక్షర్ పటేల్ పై రోహిత్ నమ్మకముంచాడు. ఇక న్యూజిలాండ్ జట్టులో కూడా మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. మిల్నె, నీషమ్, సోధి తుది జట్టులోకి వచ్చారు. గత మ్యాచ్ లో విఫలమైన రచిన్ రవీంద్ర, టాడ్ ఆస్టిల్, ఫెర్గూసన్ లకు విశ్రాంతినిచ్చారు.
జట్లు : ఇండియా : కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్ దీపక్ చాహర్, హర్షల్ పటేల్
న్యూజిలాండ్ : మార్టిన్ గప్తిల్, డరిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫర్ట్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ (కెప్టెన్) మిల్నె, ట్రెంట్ బౌల్ట్