ఎలాగూ మ్యాచులు ఆడవు! నీ ఫ్యూచర్ ఇదే... యజ్వేంద్ర చాహాల్తో రోహిత్ శర్మ కామెంట్...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ నుంచి యజ్వేంద్ర చాహాల్కి వరుస షాకులు... కుల్దీప్ యాదవ్ రీఎంట్రీతో రిజర్వు బెంచ్కే పరిమితం అవుతున్న చాహాల్..
విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నన్ని రోజులు టీమిండియాకి వైట్ బాల్ క్రికెట్లో ప్రధాన స్పిన్నర్గా ఉంటూ వచ్చాడు యజ్వేంద్ర చాహాల్. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ నుంచి యజ్వేంద్ర చాహాల్ కెరీర్ యూటర్న్ తీసుకుంది...
యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్లో అత్యధిక వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహాల్ని పక్కనబెట్టి, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్లకు అవకాశం కల్పించారు బీసీసీఐ సెలక్టర్లు. అయితే ఈ ఇద్దరూ మెగా టోర్నీలో అట్టర్ ఫ్లాప్ అయ్యి, టీమిండియా పరాజయానికి కారణమయ్యారు...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో యజ్వేంద్ర చాహాల్కి చోటు దక్కినా, ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. భార్యతో కలిసి ఆస్ట్రేలియాకి హానీమూన్కి వెళ్లొచ్చినట్టుగా చాహాల్, టీమ్తో కలిసి వెళ్లి వచ్చాడంతే...
శ్రీలంకతో జరిగిన సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన యజ్వేంద్ర చాహాల్, తుది జట్టులో చోటు కోల్పోయాడు. కుల్దీప్ యాదవ్ రీఎంట్రీ తర్వాత అదరగొడుతుండడంతో పాటు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు ఆల్రౌండర్లుగా రాణిస్తుండడంతో యజ్వేంద్ర చాహాల్ రిజర్వు బెంచ్కే పరిమితం కావాల్సి వస్తోంది...
అయితే ఏ మాత్రం నిరాశకు లోనుకాకుండా తన స్టైల్లో వినోదాన్ని పంచుతూనే ఉన్నాడు యజ్వేంద్ర చాహాల్. హైదరాబాద్లో న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకున్న భారత జట్టు, రెండో వన్డే కోసం రాయిపూర్ చేరుకుంది...
రాయిపూర్ డ్రెస్సింగ్ రూమ్ ఎలా ఉంటుందో పరిచయం చేస్తూ ‘చాహాల్ టీవీ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యజ్వేంద్ర చాహాల్. విలాసవంతమైన కుర్చీలు, ప్లేయర్ల కోసం సిద్ధం చేసిన రుచికరమైన వంటకాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన యజ్వేంద్ర చాహాల్, భారత క్రికెటర్ల కోసం ఏర్పాటు చేసిన మసాజ్ టేబుల్ని కూడా చూపించాడు..
‘ఇది మా మసాజ్ టేబుల్... ఎవరికైనా బ్యాక్ రిలిఫ్ కావాలంటే ఇక్కడ ఈ టేబుల్పైనే ట్రీట్మెంట్ జరుగుతుంది...’ అని యజ్వేంద్ర చాహాల్ చెబుతున్న టైమ్లో అటుగా వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... ‘మంచి ఫ్యూచర్ ఎంచుకున్నావ్...’ అంటూ పంచ్ డైలాగ్ వేశాడు. దీనికి చాహాల్, రోహిత్ శర్మ ఇద్దరూ నవ్వేశారు...
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేడు న్యూజిలాండ్తో రెండో వన్డే ఆడనుంది భారత జట్టు. ఇండోర్లో జనవరి 24న మూడో వన్డే జరగనుంది. తొలి వన్డేలో 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్, 337 పరుగులు చేయగలిగింది...
హార్ధిక్ పాండ్యా 7 ఓవర్లలో 70 పరుగులు ఇవ్వగా శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ షమీ కూడా భారీగా పరుగులు సమర్పించారు. మహ్మద్ సిరాజ్ 10 ఓవర్లలో 2 మెయిడిన్లతో 46 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి అదరగొట్టాడు...