డ్రాగా ముగిసిన భారత్ - ఇంగ్లాండ్ మ్యాచ్.. వేల్స్తో పోరు కీలకం..
Hockey World Cup 2023: పూల్ - డీ లో భాగంగా ఇంగ్లాండ్ తో ఆదివారం ముగిసిన మ్యాచ్ ను భారత్ డ్రా గా ముగించింది. ఈ మ్యాచ్ కూడా గెలిచి గ్రూప్ టాపర్ గా నిలవాలన్న భారత్ ఆశలు నెరవేరలేదు.

ఒడిషా వేదికగా జరుగుతున్న పురుషుల ప్రపంచకప్ హాకీలో తొలి మ్యాచ్ లో స్పెయిన్ ను ఓడించిన టీమిండియా.. రెండో మ్యాచ్ ను డ్రా చేసుకుంది. పూల్ - డీ లో భాగంగా ఇంగ్లాండ్ తో ఆదివారం ముగిసిన మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఈ మ్యాచ్ కూడా గెలిచి గ్రూప్ టాపర్ గా నిలవాలన్న భారత్ ఆశలు నెరవేరలేదు. గెలుపు కోసం ఇరు జట్లు చివరివరకూ పోరాడినా ఒక్క జట్టు కూడా గోల్ చేయలేకపోయింది. పలు మార్లు పెనాల్టీ కార్నర్ లు, గోల్ కొట్టే ఛాన్సులు లభించినా ఇరు జట్లు తృటిలో వాటిని చేజార్చుకున్నాయి.
పూల్-డీలో భాగంగా ఉన్న ఇండియా - ఇంగ్లాండ్ లు విజయం సాధించడంలో విఫలమయ్యా యి. నిర్ణీత 60 నిమిషాల వ్యవధిలో అటు ఇంగ్లాండ్ గానీ ఇటు భారత్ గానీ గోల్ కొట్టలేకపోయాయి. తొలి క్వార్టర్ లో ఇండియా ప్లేయర్ హార్ధిక్ సింగ్ గోల్ కోసం యత్నించి విఫలమయ్యాడు.
తొలి క్వార్టర్స్ తో పాటు రెండో అర్థభాగంలో పెనాల్టీ గోల్ చేసే అవకాశం భారత్ కు వచ్చినా దానిని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇరు జట్ల గోల్ కీపర్లు గోల్ పోస్ట్ వద్ద అడ్డుగోడగా నిలిచారు. మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్ గోల్ కీపర్ ఒలివర్ ఫైన్ అయితే గోల్ పోస్ట్ ముందు పెట్టనిగోడగా నిలుచున్నాడు. భారత ఆటగాళ్లు గోల్ కోసం విశ్వప్రయత్నాలు చేసినా అతడు సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఇందుకు గాను ఈ మ్యాచ్ లో అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇక మొదటి మ్యాచ్ లో స్పెయిన్ ను ఓడించిన భారత్.. ఇంగ్లాండ్ తో గెలిచి గ్రూప్ టాపర్ గా నిలవాలనుకుంది. కానీ మ్యాచ్ డ్రా కావడంతో ఇరు జట్లకు చెరో నాలుగు పాయింట్లు చేరాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్.. అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. భారత్ తర్వాత మ్యాచ్ వేల్స్ తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచి స్పెయిన్ తో ఇంగ్లాండ్ ఓడితే అప్పుడు ఇండియా నేరుగా క్వార్టర్స్ కు క్వాలిఫై అవుతుంది. టోర్నీ నిబంధనల ప్రకారం గ్రూప్ టాపర్ గా ఉన్న జట్టు నేరుగా క్వార్టర్స్ కు వెళ్తుంది. గ్రూప్ లో రెండో స్థానంలో ఉన్న టీమ్ లు.. నాకౌట్ స్టేజ్ లో ఆడాల్సి ఉంటుంది. వేల్స్ అంత కఠిన ప్రత్యర్థి కాకపోయినా.. ఇంగ్లాండ్ ను స్పెయిన్ ఓడిస్తుందా..? లేదా..? అనేది తేలాల్సి ఉంది.