IND vs ENG: షోయబ్ బషీర్ ఉచ్చులో భారత్.. ! కష్టాల్లో టీమిండియా !
India vs England: రాంచీ వేదికగా భారత్ తో జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ రెండో రోజు ఇంగ్లాండ్ స్పిన్ మాయాజాలంతో భారత్ ను దెబ్బతీశారు. 211 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.
![India vs England: India in Shoaib Bashir trap, India lose 7 wickets for 200 runs in Ranchi Test RMA India vs England: India in Shoaib Bashir trap, India lose 7 wickets for 200 runs in Ranchi Test RMA](https://static-ai.asianetnews.com/images/01hqdb32w9kfdhexchf8peahxb/jurel-jpg_363x203xt.jpg)
India vs England : టీమిండియా కష్టాల్లో పడింది. రాంచీలో జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ లో భారత జట్టును ఇంగ్లాండ్ బౌలర్లు దెబ్బతీశారు. ముఖ్యంగా షోయబ్ బషీర్ ఖాన్ ఉచ్చులో భారత బ్యాటర్లు చిక్కుకున్నారు. యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ఒంటరి పోరాటం సాగించినా మరో ఎండ్ లో వరుసగా వికెట్లు పడిపోవడంతో భారత్ ప్రస్తుతం 211 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుం క్రీజులో కుల్దీప్ యాదవ్, ధృవ్ జురెల్ లు ఉన్నారు.
షోయబ్ బషీర్ ఉచ్చులో భారత్..
ఇంగ్లాంగ్ బౌలర్ షోయబ్ బషీర్ తన సూపర్ బౌలింగ్ తో భారత్ ను దెబ్బతీశాడు. అతను ఈ ఇన్నింగ్స్ లో ఇప్పటివరకు 4 వికెట్లు తీసుకున్నాడు. యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, రజత్ పటిదార్, రవీంద్రజడేజాలను పెవిలియన్ కు పంపాడు. ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మూడో ఓవర్ లోనే రోహిత్ శర్మను ఔట్ చేసి భారత్ పై ఒత్తిడి పెంచాడు. ఆ తర్వాత గిల్, జైస్వాల్ భారత్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో శుభ్ మన్ గిల్ 38 పరుగుల వద్ద షోయబ్ బషీర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రజత్ పటిదారు 17 పరుగులు, రవీంద్ర జడేజా 12 పరుగులు, చేసి ఔట్ అయ్యారు. రాజ్ కోట్ టెస్టులో ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ రాంచీలో నిరాశపరిచాడు. 53 బంతులను ఎదుర్కొని 14 పరగుల వద్ద టామ్ హార్టీ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. రవించద్రన్ అశ్విన్ కూడా కేవలం ఒక పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ కీపర్ జురెల్, కుల్దీప్ యాదవ్ లు క్రీజులో ఉన్నారు.
అంతకుముందు, బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు 353 పరుగులకు ఆలౌట్ అయింది. సీనియర్ ప్లేయర్ జోరూట్ సెంచరీతో అదరగొట్టాడు. 112 పరుగులతో అజేయంగా నిలిచాడు. జాక్ క్రాలీ 42 పరుగులు చేయగా, ఫోక్స్ 47 పరుగులు కొట్టాడు. రాబిన్సన్ తన తొలి టెస్టు హాఫ్ సెంచరీని భారత్ పై సాధించాడు. అతను 58 పరుగులు చేయగా, మిగతా ప్లేయర్లు పెద్దగా పరుగులుచేయకుండానే పెవిలియన్ కు చేరారు.