ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌రిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్‌కు శుభారంభం ల‌భించింది. మొద‌టి రోజు మ్యాచ్‌లో భార‌త్ బ్యాట‌ర్లు అద్భుత ఆట‌తీరును క‌న‌బ‌రిచారు. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ 3 వికెట్ల న‌ష్టానికి 318 ప‌రుగులు చేసింది. 

అద్భుత ఆరంభంతో భారత జట్టు పైచేయి

ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ప్రారంభమైన ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ డే 1 భారత్‌కు అనుకూలంగా సాగింది. లీడ్స్‌ హెడింగ్లీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకుంది. కానీ భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మెరుపులు భార‌త్‌కు మంచి ఆరంభాన్ని అందించాయి.

జైస్వాల్ సెంచరీ

యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన దూకుడైన ఆటతీరుతో టెస్ట్ కెరీర్‌లో ఐదవ సెంచరీని సాధించాడు. అతను 144 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో సెంచరీ సాధించాడు. గత సిరీస్‌లో ఇంగ్లండ్‌పై రెండు డబుల్ సెంచరీలు చేసిన జైస్వాల్, ఇప్పుడు విదేశీ గడ్డపై కూడా తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించాడు.

గిల్ అద్భుత సెంచ‌రీ

శుభ్‌మ‌న్ గిల్ సైతం త‌న అద్భుత ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్నాడు. 144 బంతుల్లో 111 ప‌రుగులు సాధించి అజేయంగా నిలిచాడు. 14 ఫోర్లు, ఒక సిక్స్‌తో సెంచ‌రీని త‌న ఖాతాలో వేసుకున్నాడు. రెండో రోజు డ‌బుల్ సెంచ‌రీ దిశ‌గా దూసుకెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఓపెనింగ్ భాగస్వామ్యం భారత్‌కు పెద్ద బలం

జైస్వాల్, రాహుల్ కలిసి 91 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యంతో భారత ఇన్నింగ్స్‌కు పటిష్ట ఆరంభాన్ని అందించారు. లీడ్స్ వేదికగా టెస్ట్ మ్యాచ్‌లో ఓపెన‌ర్స్‌ నుంచి ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. కేఎల్ రాహుల్ 78 బంతుల్లో 42 పరుగులు చేయగా, లంచ్‌కు ముందు జో రూట్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

గిల్ నాయకత్వానికి అదిరిపోయే ఆరంభం

కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ఈ టెస్ట్ మ్యాచ్ భారత్‌కి కొత్త శకానికి నాంది పలికేలా ఉంది. జైస్వాల్‌తో కలిసి అద్భుత‌మైన ఇన్నింగ్స్‌ను అందించారు. దీంతో భార‌త్ తొలి రోజు భారీ స్కోర్‌ను సాధించింది.